TS RTC | ఎప్పటికప్పుడు ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందిస్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (RS RTC) తొలిసారిగా సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకున్నది. ప్రైవేటు ట్రావెల్స్కు ధీటుగా రాష్ట్రంలో తొలిసారిగా ఏసీ స్లీపర్ సర్వీసుల (AC Sleeper Bus)ను ప్రారంభించబోతున్నది. ఇప్పటికే కొత్త సూపర్ లగ్జరీ, నాన్ ఏసీ స్లీపర్, సీటర్ కమ్ స్లీపర్ బస్సులను ప్రారంభించిన సంస్థ.. సుదూర ప్రాంతాలకు ప్రయాణించే వారి కోసం ఏసీ స్లీపర్ సర్వీసులను నడపబోతున్నది. 16 స్లీపర్ సర్వీసులను సంస్థ కొనుగోలు చేయగా.. మార్చిలో ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, తిరుపతి, తమిళనాడులోని చెన్నై మార్గాల్లో ఈ ఏసీ స్లీపర్ బస్లను ఆర్టీసీ నడిపేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఈ బస్సులకు ‘లహరి’ (Lahari) సర్వీస్గా నామకరణం చేసింది.
మొత్తం 30 సీటింగ్ సామర్థ్యం ఉన్నది. ఒక్కో బెర్తు 12 మీటర్ల పొడవు ఉండగా.. లోయర్ బెర్తులు 15, అప్పర్ 15 బెర్తులు ఉంటాయి. బెర్తుల వద్దనే వాటర్ బాటిల్ పెట్టుకునే సదుపాయంతో పాటు మొబైల్ చార్జింగ్ సౌకర్యం కూడా ఉంది. ప్రతి బెర్త్ వద్ద రీడిండ్ ల్యాంప్లను సైతం ఏర్పాటు చేశారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని బస్సుల్లో వెహికిల్ సిస్టంతో పాటు.. పానిక్ సదుపాయం కల్పించారు. వాటిని టీఎస్ఆర్టీసీ కంట్రోల్ రూమ్కు అనుసంధానిస్తారు. ప్రయాణికుల కోసం వైఫై సదుపాయాన్ని కల్పించారు. ప్రతి బస్సులోనూ రెండు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అవి కేబిన్లో, బస్సు లోపల ఉన్నాయి. బస్సు రివర్స్ చేసేందుకు వీలుగా రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా కూడా ఉంది. బస్సుకు ముందు వెనుకాల ఎల్ఈడీ బోర్డులుంటాయి. అందులో గమ్యస్థానాల వివరాలు కనిపిస్తాయి. అగ్ని ప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టంను ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు సమాచారం కోసం పబ్లిక్ అడ్రస్ సిస్టం అందుబాటులో ఉంచారు.
లహరి ఏసీ స్లీపర్ బస్ మోడల్ను హైదరాబాద్లోని బస్ భవన్ ప్రాంగణంలో టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ పరిశీలించారు. బస్సులో ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని ఆయన అధికారులను ఆదేశించారు. తెలంగాణలో మొదటిసారిగా అందుబాటులోకి తీసుకువస్తోన్న టీఎస్ఆర్టీసీ ఏసీ స్లీపర్ బస్లకు మంచి ఆదరణ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన వెంట చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ రవీందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) పీవీ మునిశేఖర్, చీఫ్ పర్సనల్ మేనేజర్ (సీపీఎం) కృష్ణకాంత్, చీఫ్ మెకానికల్ ఇంజినీర్ (సీఎంఈ) రఘునాథరావు, చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ (సీటీఎం) జీవన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.