హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రాజకీయ కల్లోలం సృష్టించేందుకు కుట్రలు జరుగుతున్నాయని టీఎస్ రెడ్కో చైర్మన్ సతీశ్రెడ్డి ఆరోపించారు. పాదయాత్ర పేరుతో వైఎస్ షర్మిల రాష్ట్రంలో అలజడి రేపేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తన పాదయాత్రలో సీఎం కేసీఆర్, స్థానిక ఎమ్మెల్యేలను దుర్భాషలాడటమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ ఇలా వ్యవహరించినందుకు హైకోర్టు మొట్టికాయలు వేసిన విషయాన్ని షర్మిల మర్చిపోయారా? అని ఆయన ప్రశ్నించారు. ఏది పడితే అది మాట్లాడొద్దని, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని హైకోర్టు గతంలోనే హెచ్చరించినా వాటిని షర్మిల పెడచెవిన పెట్టారని అన్నారు.
ఆమెపై కోర్టు ధిక్కార కేసు నమోదు చేయాలని పోలీసులను ఆయన కోరారు. ప్రజలు ఎన్నుకున్న నాయకులపై కనీస గౌరవం లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ రాజకీయ నాయకులపై ప్రజల్లో ఉన్న గౌరవం పోయేలా వైఎస్ షర్మిల వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. షర్మిల తీరు నచ్చక తెలంగాణ పల్లెల్లో ప్రతి చోటా స్థానికులు అడ్డుకుంటున్నారని, నిలదీస్తున్నారని చెప్పారు. వివాదాలు, గొడవలు సృష్టించి తన పెయిడ్ మీడియాలో పబ్లిసిటీ చేయించుకోవడానికి షర్మిల ఇదంతా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల చిల్లర రాజకీయాలను తెలంగాణ ప్రజలు ఆమోదించరని, ఆమె ఇకనైనా తన పద్ధతి మార్చుకుంటే మంచిదని హితవు పలికారు.