TS Minister Koppula Eswar | త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే చీకటి రోజులేనని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. ఐదు దశాబ్దాల పాలనలో వ్యవసాయాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసి, రైతులను గోసపెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. గురువారం ఆయన ధర్మపురి నియోజకవర్గం గొల్లపల్లి మండలం ఆత్మకూరు, దమ్మన్నపేట, లక్ష్మీపూర్ గ్రామాలలో జరిగిన ప్రజా ఆశీర్వాద యాత్రలో పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో ప్రజలు మంత్రి కొప్పుల ఈశ్వర్కు ఘన స్వాగతం పలికారు. వాడవాడల తిరిగి మంత్రి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. లక్ష్మీపూర్ గ్రామ ఎస్సీ కాలనీలో 300 మంది.. మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దమ్మన్నపేట, లక్ష్మీపూర్ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, పలు పథకాలకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. గతంలోకరెంట్, ఎరువులు, నీళ్లు ఇవ్వకుండా, ప్రాజెక్టులు కట్టకుండా, చెరువులు బాగుచేయకుండా వ్యవసాయాన్ని అధోగతి పాలు చేసి, రైతన్నల ఆత్మహత్యలకు కారణమైంది ఈ కాంగ్రెస్ పార్టీ కాదా? అని నిలదీశారు. తెలంగాణను సీఎం కేసీఆర్ బొమ్మరిల్లులా తీర్చిదిద్దుతుంటే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విషం చిమ్ముతున్నాడని ఆరోపించారు. రైతుల కడుపు కొట్టేవిధంగా మాట్లాడుతున్నారన్నారు.
కాంగ్రెస్ పార్టీ పాలనలోమూడు గంటల కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియక రైతులు పాముకాట్లకో, మిత్తీల పాట్లకో అర్ధంతరంగా ప్రాణాలు వదిలారని కొప్పుల ఈశ్వర్ చెప్పారు. రైతులను బతికించుకోవడానికి మధన పడిన సీఎం కేసీఆర్ మది నుంచి పుట్టిన పథకమే వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ పథకం అని అన్నారు.
వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలన్న వ్యాఖ్యలపై రైతులకు కాంగ్రెస్ పార్టీ, రేవంత్రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరెంట్ పరిస్థితులపై రైతులు గుండెలపై చేతులు వేసుకొని ఆత్మపరిశీలన చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నాట్లు వేసే కాలం వచ్చిందంటే ఎరువుల దుకాణాల ముందు చెప్పుల వరుసలు, విత్తనాల దుకాణాల ముందు క్యూలైన్లు ఉండేవి కావా అని ప్రశ్నించారు.
ఎండకాలం వస్తే ఎండిన పంటలు, సబ్స్టేషన్ల ముందు ధర్నాలు నిత్యకృత్యమయ్యేవని కొప్పుల ఈశ్వర్ గుర్తుచేశారు. 2014 తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఒకవైపు సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయతో చెరువులను బాగుచేస్తూనే, మరోవైపు రైతుబంధు వంటి విప్లవాత్మక పథకాలు అమలుచేశామని చెప్పారు.
స్వరాష్ట్రంలో కేవలం మూడున్నరేండ్లలోనే వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు ఇచ్చి సీఎం కేసీఆర్ అన్నదాతల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు.