రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వట్టి భ్రమేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి తేల్చిచెప్పారు. ముందస్తు ఉండదు.. వెనకస్తు జరగదని స్పష్టం చేశారు. ముందస్తూ అంటూ మాజీ పీసీసీ కలలు కంటున్నారని ఆ కలలు అన్ని పగటి కలలుగానే ఉంటాయని ఆయన ఎద్దేవా చేశారు. శనివారం ఉదయం సూర్యపేట జిల్లా కేంద్రంలో మహిళా, శిశు,దివ్యాంగుల, వయో వృద్ధుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి పాల్గొన్నారు. దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల స్కూటీలు, ట్రై సైకిళ్లు, లాప్టాప్లతో పాటు 4 జీ ఫోన్లను అందజేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.
దివ్యాంగులకు అండగా నిలిచిన ఏకైక ప్రభుత్వం సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనని మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి అధికారంలోకి రాగానే.. దివ్యాంగులకు రూ.1500 పింఛన్ అందజేశారని గుర్తు చేశారు. రెండోసారి అధికారంలోకి రాగానే 1500 ఉన్న పింఛన్ను రూ.3వేలకు పెంచారన్నారు. దివ్యాంగులు అడగకపోయినా వారి జీవితాల్లో వెలుగులు నింపే పద్ధతిలో వారికి ఆసరగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని తెలిపారు. అంగ వైకల్యతను అధిగమించి మిగతావారితో పోటీగా అన్ని రంగాల్లో రాణించేలా మానసికంగా వారిని సిద్ధపరచడమే తమ ముందున్న కర్తవ్యమని పేర్కొన్నారు. ఇటువంటి ఆలోచన దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఉందా అని కాంగ్రెస్, బీజేపీలను ప్రశ్నించారు.
నరేంద్ర మోదీ ప్రధాని కావడానికి ముందు ఏకధాటిగా 25 ఏండ్లు ముఖ్యమంత్రిగా ఉన్న గుజరాత్ రాష్ట్రంలోనూ ఎటువంటి సంక్షేమ పథకాలు అమల్లో లేవని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. 25 ఏండ్ల పాలనలో గుజరాత్లో ఇంటింటికీ మంచినీరు అందించలేని వారు.. ఇక దేశాన్ని ఏం అభివృద్ధి చేస్తారని నిలదీశారు. మోదీ పాలనలో సంక్షేమం ఉండదు.. అభివృద్ధి జరగదని ఎద్దేవా చేశారు. అభివృద్ధి అంటూ జరిగితే ఒకరిద్దరు దళారులకు మాత్రమే ఆ ఫలితం దక్కిందని విమర్శించారు. అభివృద్ధిపై చర్చకు బీజేపీ సిద్ధం అనుకుంటే ఢిల్లీకి అయినా.. గాంధీనగర్కు అయినా తమ పార్టీ కార్యకర్తలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. సీఎం కేసీఆర్ విజన్కు బీజేపీ 100 మైళ్ల దూరంలో ఉందన్నారు.
కళ్యాణలక్ష్మి/షాది ముబారక్, రైతుభీమా, రైతుబంధు వంటి పథకాలు దేశంలోని కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు. ఉంటే చెప్పాలంటూ మంత్రి జగదీశ్ రెడ్డి సవాలు విసిరారు. రైతు బంధు పేరుతో 14 నుంచి 15 వేల కోట్ల రూపాయలు రైతాంగానికి పెట్టుబడుల రూపంలో అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా సహజ మరణాలకు కూడా రైతుబీమా వర్తించేలా పథకాన్ని తీసుకొచ్చింది కేసీఆర్ కాదా అని నిలదీశారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా ను కరువు పీడిత ప్రాంతంగా మార్చిన ఘనత ముమ్మాటికి కాంగ్రెస్ దేనని, అంతే గాకుండా రెండు లక్షల మంది ఫ్లోరైడ్ బారిన పడేందుకు కారణం కూడా ఆ పార్టీదేనన్నారు.అటువంటి పాపాలనుమూట కట్టుకున్న కాంగ్రెస్ పార్టీని ఇప్పటికే జిల్లా ప్రజలు పాతర పెట్టారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 కు 12 స్థానాలలో జెండా ఎగరేసేది టీఆర్ఎస్ పార్టీయేనని అన్నారు. సీఎం కేసీఆర్పై ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు విశ్వసనీయత పెరిగిందని చెప్పడానికి నాగార్జునసాగర్, హుజూర్నగర్ ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనమని చెప్పారు.