హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నిర్విఘ్నంగా కొనసాగుతున్న సకల రంగాల ప్రగతిని మరింత ఎత్తుకు తీసుకెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం 2023-24 వార్షిక బడ్జెట్ను రూపొందించింది. అన్నివర్గాల ప్రజలను మురిపించేలా ఆర్థికమంత్రి హరీశ్రావు రాష్ట్ర బడ్జెట్ను సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.2,90,396 కోట్లతో భారీ బడ్జెట్ను సభ ముందు ఉంచా రు. ఇందులో నిర్వహణ పద్దు రూ. 1,30,858 కోట్లు, ప్రగతి పద్దు రూ. 1,59,538 కోట్లుగా పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రాధాన్య రంగాలైన వ్యవసాయం, రైతుబంధు, దళితబంధు, నీటిపారుదల, డబుల్ బెడ్రూం ఇండ్లు, విద్య, వైద్యానికి బడ్జెట్లో పుష్కలంగా నిధులు కేటాయించారు. ప్రధాన రంగాలకు భారీగా నిధులిస్తూనే, ఈ బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి పెద్ద పీట వేసినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం బడ్జెట్లో నిర్వహణ వ్యయం రూ.2,11,685 కోట్లు కాగా, మూలధనం వ్యయం 37,525 కోట్లుగా పేర్కొన్నారు.
స్వతంత్ర భారతదేశంలో అసలైన అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో 2014-15లో రూ.1,00,637 కోట్లు ఉన్న రాష్ట్ర బడ్జెట్, 2023-24 నాటికి రూ. 2,90,396 కోట్లకు చేరింది. ఎనిమిదేండ్లలోనే రాష్ట్ర బడ్జెట్ మూడు రెట్లు పెరిగింది. ఏకంగా 150 శాతం వృద్ధి సాధించింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి బడ్జెట్ ఏటా సగటున 12.69 శాతం పెరుగదల నమోదుచేసింది. 8 ఏండ్ల క్రితం రూ.30 వేల కోట్లు దాటని పన్ను ఆదాయం నేడు రూ.1.31 లక్షల కోట్లకు చేరింది. పన్ను ఆదాయం ఏటా సగటున 18.97 శాతం వృద్ధి సాధించింది. మొత్తంగా రాష్ట్ర పన్ను ఆదాయం 227 శాతం వృద్ధి నమోదు చేసింది. కొవిడ్ విజృంభణ సమయంలో తప్ప రాష్ట్ర పన్ను ఆదాయ వృద్ధి ఎప్పుడూ పెరుగుతూనే ఉన్నది. 2020-21లో పన్ను ఆదాయ వృద్ధిరేటు మైనస్ 1.46 శాతంగా నమోదైనప్పటికీ, ఆ మరుసటి ఏడాది నుంచి గోడకు కొట్టిన బంతిలా రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 36.94% వృద్ధిరేటును నమోదు చేసి రికార్డు సృష్టించింది.
మొత్తం రాబడి రూ.2,89,673 కోట్లు
రెవెన్యూ రాబడి రూ.2,16,567 కోట్లు
రాష్ట్ర సొంత రాబడి రూ.1,53,837 కోట్లు
రాష్ట్ర ఆర్థిక బడ్జెట్లో అన్ని వర్గాల సంక్షేమంతోపాటు విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాలకు భారీగా నిధులు కేటాయించి ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాలకు అండగా నిలిచింది. తెలంగాణ బడ్జెట్ దేశానికి మాడల్గా నిలుస్తూ, మహిళలు ఆర్థికంగా మరింత ప్రగతి సాధించేందుకు బడ్జెట్లో పెద్దపీట వేయడం సంతోషకరం. దళితులు, మైనార్టీల భద్రత, సంక్షేమం, అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ అంకితభావంతో ముందుకు సాగుతున్నారనడానికి బడ్జెట్ నిదర్శనం. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి చేసి కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తాం.
– పువ్వాడ అజయ్కుమార్, రవాణాశాఖ మంత్రి
రైతురాజు కావాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ నాయకత్వంలో మంత్రి హరీశ్రావు బడ్జెట్లో కేటాయింపులు చేశారు. సంక్షేమ రంగాలకు అధిక నిధులు కేటాయించి సబ్బండ వర్ణాల అభ్యున్నతికి దోహదపడ్డారు. ప్రజలకు విద్య, వైద్య సేవలను అందించే ఉద్దేశంతో ఆ రంగాలకు అధిక నిధులు కేటాయించారు. అందరికీ ఆమోదయోగ్య బడ్జెట్ రూపకల్పన చేశారు.
-ఎర్రోళ్ల శ్రీనివాస్, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్
రాష్ట్ర బడ్జెట్ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అద్దం పట్టేలా ఉన్నది. అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కడుతూ సబ్బండవర్ణాలకు సమ న్యాయం చేసేలా సమగ్రంగా ఉన్నది. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పిస్తూ, నూతన ఉద్యోగాల కోసం ముందే రూ.1000 కోట్లు కేటాయించారు. కాంట్రాక్టు ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు.
-పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్సీ
బీజేపీ పాలిత రాష్ర్టాల కంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రగతిశీల బడ్జెట్. నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి. గిరిజనులకు గిరిజనబంధు కల్పించాలి. 80 వేల ఉద్యోగ ఖాళీలను పూర్తి చేయడం సంతోషమే. ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టినట్టు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాలి.
-కూనంనేని సాంబశివరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
వార్షిక బడ్జెట్లో కేటాయింపులు ఘనంగా ఉన్నాయి. రూ.2,90,296 కోట్లతో బడ్జెట్ పెట్టడం చారిత్రాత్మకం. వ్యవసాయం, సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చారు. అన్నివర్గాలు సంతృప్తి చెందేలా కేటాయింపులు జరిగాయి.
-తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి