బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే అచ్చే దిన్ ఆయేగా అని చెప్పారు.. అచ్చేదిన్ ఏమో గానీ.. తాజా బడ్జెట్ చూస్తుంటే జనం సచ్చేదిన్ మాత్రం ఖాయంగా వచ్చినట్లే కనిపిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కేంద్ర బడ్జెట్పై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ను నిష్ప్రయోజక, నిరర్దక బడ్జెట్గా పేర్కొన్నారు. అధికారంలోకి రావడానికి కోసిన కోతలకు విరుద్ధంగా, బడ్జెట్లో అన్నీ కోతలే కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. గతంలో ప్రవేశ పెట్టిన జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగిస్తూ వచ్చిన బీజేపీ ప్రభుత్వం.. తాజాగా గ్రామీణ అభివృద్ధికి ఎంతో మేలు చేస్తున్న ఆ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు పూనుకున్నదన్నారు. ఉపాధి హామీకి ఇంతకుముందు 98వేల కోట్లు ఉండగా, ఇప్పుడు 73వేల కోట్లకు కుదించారని అన్నారు. గ్రామీణాభివృద్ధి శాఖకు సైతం కేటాయింపుల తగ్గింపు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మన మిషన్ భగీరథ పథకాన్ని కాపీ చేసి అమలు చేస్తున్న జల్ శక్తి మిషన్ పథకంలో భాగంగా నీతి అయోగ్ సిఫారసులకు విరుద్ధంగా కనీసం 19వేల కోట్లు ఇవ్వాలని సిఫారసు చేసింది కానీ వాటిని కేంద్రం పట్టించుకోలేదన్నారు. గత రెండేళ్లలో నల్ సే జల్ కింద 5.7 కోట్ల కుటుంబాలకు అందుబాటులోకి తాగునీరు తెచ్చామని చెబుతున్నప్పటికీ, నల్ సే జల్ కింద కూడా మన రాష్ట్రం లేకపోవడం విచారకరమని మంత్రి ఎర్రబెల్లి ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యవసాయానికి పూర్తిగా సహాయ నిరాకరణ చేసిందన్నారు. యూరియా మీద సబ్సిడీని 12,708 కోట్లు తగ్గించారు. ఇతర ఎరువుల మీద 22,190కోట్లు తగ్గించారు. మొత్తం 34,900 కోట్లు ఎరువుల మీద సబ్సిడీని తగ్గించారు. దీంతో ఇక రైతులకు వ్యవసాయం భారంగా మారే ప్రమాదం ఏర్పడింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా నిధులు అడిగాం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు నిధులు అడిగాం. ఐఐఎం, కేంద్రీయ, జవహర్ నవోదయ విద్యాలయాలు వంటి జాతీయ విద్యా సంస్థలను, ఐటిఐఆర్ వంటి ప్రాజెక్టులు ఇస్తామన్నారు. అసలు ఏ విషయాన్నీ కేంద్రం దన బడ్జెట్ లో పట్టించుకున్న దాఖలాలే లేవు.
మన రాష్ట్రం రైతు బీమా పథకాన్ని అమలు చేస్తూ, ఇన్సూరెన్స్ సంస్థలను బతికిస్తుంటే, కేంద్రం ప్రజలు అత్యంతగా నమ్మే ఎల్ఐసీని ప్రైవేట్ పరం చేస్తామని ప్రకటించడం అంత దారుణం, విచారకరమైన విషయం మరోటిలేదు. రాష్ట్రాలకు ఆర్థికసాయంగా రూ.లక్ష కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక నిధి ద్వారా రాష్ట్రాలకు వడ్డీలేని రుణాలు అందిస్తామన్నారు. ఉన్న నిధులకే దిక్కులేక కోతలు విధిస్తూ, కొత్తగా కేంద్రం అప్పులు ఇస్తుందంటే నమ్మశక్యంగాలేదని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. అప్పులు ఇవ్వడానికి కేంద్రం ప్రభుత్వ పరంగా పని చేస్తున్నదా? లేక వడ్డీ వ్యాపారం చేస్తున్నదా? అని మంత్రి ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు.
కేంద్ర ప్రభుత్వం విభజన హామీలకు తిలోదకాలు ఇచ్చినట్లుగా కనిపిస్తున్నదని, విభజన హామీల ఊసే లేకుండా బడ్జెట్ ఉండటం పట్ల మంత్రి ఎర్రబెల్లి అభ్యంతరం వ్యక్తం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన లేదు. డిజిటల్ యూనివర్సిటీలు సరే, మా గిరిజన యూనివర్సిటీ సంగతేంటి? అని మంత్రి సూటిగా ప్రశ్నించారు. కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ… బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తామని చెప్పారు. కోచ్ ఫ్యాక్టరీకి స్థలం కూడా ముందుగా 50 ఎకరాలు, తర్వాత 100 ఎకరాలు అడిగితే, 150 ఎకరాల స్థలం ఇచ్చాం. ఈ బడ్జెట్ లో కూడా కనీసం ఆ ప్రస్థావనే లేదని మంత్రి అన్నారు. వరంగల్ టెక్స్ టైల్ పార్క్ కు నిధుల ఊసు లేదన్నారు.
అసలు తెలంగాణ పట్ల బీజేపీకి ఇంత వివక్ష దేనికి? మిషన్ భగీరథ, రైతు బంధు, తాజాగా రిజిస్ట్రేషన్ల పద్ధతి వంటి అనేక పథకాలను కాపీ కొట్టారు. సరే, మన పథకాలకు అవార్డులు రివార్డులు ఇస్తున్నారు. మరి అవార్డులిస్తున్న రాష్ట్రానికి ప్రశంసలే తప్ప నిధులేవి? అంటూ మంత్రి దయాకర్ రావు కేంద్రాన్ని ప్రశ్నించారు. ఉపాధి హామీకి నిధులు తగ్గించారు. గ్రామీణ నిరుద్యోగులకు ఏం చెబుతారు? ఇక ఇప్పుడు రాష్ట్ర బీజేపీ నేతలు మాట్లాడాలి. తెలంగాణ బిడ్డలుగా రాష్ట్రానికి మీరు తెచ్చింది, మీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందేంటో ప్రజలకు చెప్పాలి. అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీజేపీ నేతలకు సవాల్ విసిరారు.