హైదరాబాద్, మే 18 (నమస్తేతెలంగాణ) : లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన లాసెట్, పీజీ లాసెట్ ఫలితాలు జూన్ 5న విడుదల కానున్నాయి. లాసెట్, పీజీ లాసెట్ పరీక్షలను సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. ఈ నెల 23న ప్రాథమిక ‘కీ’ విడుదల చేస్తారు. 25 వరకు ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాలు వ్యక్తంచేయవచ్చు.
లాసెట్కు 66,864 మంది దరఖాస్తు చేసుకోగా, 54,374 మంది (81.32%) అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. మూడేండ్ల లా కోర్సుకు 80%, ఐదేండ్ల లా కోర్సుకు 83%, ఎల్ఎల్ఎం కోర్సులో ప్రవేశాలు కల్పించే పీజీ లాసెట్కు 83% చొప్పున అభ్యర్థులు హాజరైనట్టు లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ బీ విజయలక్ష్మి తెలిపారు.
రాష్ట్రంలోని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, వీఐపీలు లా కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, గాయని కల్పన, యాంకర్ కనకాల సుమ, బుల్లితెర నటుడు విజయ్రెడ్డి, బల్వీర్సింగ్(జబర్దస్త్ ఫేమ్)తో పాటు పలువురు యూట్యూబర్లు లాసెట్కు దరఖాస్తు చేసుకున్నారు. యాంకర్ సుమ సోమవారం నిర్వహించిన పరీక్షకు గైర్హాజరైనట్టు సమాచారం.
మంత్రి సీతక్క ఎల్ఎల్ఎం కోర్సు ప్రవేశ పరీక్ష రాశారు. సీతక్క ఇప్పటికే ఎల్ఎల్ఎం కోర్సు పూర్తిచేయగా, మరోసారి పీజీ లాసెట్ పరీక్షకు హాజరయ్యారు. రిటైర్డ్ ఉద్యోగులు, డాక్టర్లు, రాజకీయ నాయకులు లా కోర్సుల్లో చేరేందుకు ప్రవేశ పరీక్ష రాసి పోటీపడ్డారు.