హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): పరిశ్రమల ఏర్పాటు కోసం భూములు తీసుకొని నిర్దిష్ట గడువులో వాటిని స్థాపించకపోవతే భూములను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్బాబు అధికారులను ఆదేశించారు. గతంలో భూములు పొంది, ఈడీ, సీబీఐ వంటి సంస్థలు జప్తు చేసిన భూములపై హకు తిరిగి పొందేలా న్యాయస్థానాల్లో పోరాడేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. శనివారం టీఎస్ఐఐసీ కార్యాలయంలో మంత్రి శ్రీధర్బాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర విభజనకు ముందు, తరువాత జరిగిన భూకేటాయింపుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి అధికారి ఫీల్డ్ విజిట్ చేసి వినియోగంలో లేకుండా ఖాళీగా ఉన్న భూములను గుర్తించాలని, వినియోగించకపోవడానికి గల కారణాలతో త్వరితగతిన నివేదిక ఇవ్వాలని కోరారు. భూములు పొందిన సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా థర్డ్ పార్టీలకు లీజుకు ఇస్తే ఆ వివరాలను సేకరించాలని మంత్రి ఆదేశించారు. పలు సంస్థలు, కంపెనీలు డివిడెండ్, షేర్హోల్డ్ అమౌంట్ చెల్లించని అంశాలపై కూడా మంత్రి నివేదిక కోరారు.