హైదరాబాద్ : కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులను పరీక్షలు లేకుండానే ప్రభుత్వం ప్రమోట్ చేసింది. కాగా ద్వితీయ సంవత్సర పరీక్షలను వాయిదా వేసింది. జూన్ మొదటివారంలో సమీక్షించి రెండో సంవత్సరం పరీక్షలపై నిర్ణయం వెలువరించనుంది. బ్యాక్లాగ్ ఉన్న సెకండియర్ విద్యార్థులకు కనీస పాస్ మార్కులు ఇవ్వనుంది. పరిస్థితులు మెరుగయ్యాక ఫస్టియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించే యోచన చేయనుంది. ఎంసెట్లో ఇంటర్ మార్కులకు ఇచ్చే 25 శాతం వెయిటేజీని సైతం రద్దు చేసింది. కనీసం 15 రోజుల ముందే సెకండియర్ పరీక్షల కొత్త తేదీలను ప్రకటించనున్నట్లు పేర్కొంది.
ఎడ్యూకేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రా రామచంద్రన్, ఇంటర్ బోర్డు ఆఫ్ ఎడ్యూకేషన్ కమిషనర్, సెక్రటరీ సయీద్ ఒమర్ జలీల్, డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ సత్యనారాయణ రెడ్డి పరీక్షల నిర్వహణపై నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. దీనిపై సీఎం కేసీఆర్ గురువారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం సీఎం ఆదేశానుసారం విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించారు.