TS Inter Exams | హైదరాబాద్, మార్చి 14(నమస్తే తెలంగాణ): ఇంటర్ వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఇంటర్బోర్డు కార్యదర్శి నవీన్మిట్టల్ వెల్లడించారు. నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్షలకు అనుమతించబోమని పేర్కొన్నా రు. విద్యార్థులంతా సకాలంలో పరీక్షాకేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. నాంపల్లిలోని ఇంటర్ విద్య కమిషనరేట్లో పరీక్షల ఏర్పాట్లపై మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ బుధవారం ప్రారంభమయ్యే పరీక్షలు ఏప్రిల్ 4 వరకు జరుగుతాయని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 1,473 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశామని, 9.47 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్టు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచే విద్యార్థులను పరీక్షాకేంద్రాల్లోకి అనుమతిస్తామని చెప్పారు. పరీక్షల ఏర్పాట్ల సమన్వయానికి జిల్లా ల అధికారులతో కో-ఆర్డినేషన్ కమిటీలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు.
ఈ సంవత్సరం హాల్టికెట్లను సులువుగా డౌన్లోడ్ చేసుకొనే అవకాశాన్ని ఇచ్చినట్టు నవీన్మిట్టల్ తెలిపారు. గతంలో కాలేజీ లాగిన్లో హాల్టికెట్లు అందుబాటులో ఉండేవని, ప్రస్తు తం విద్యార్థులే నేరుగా డౌన్లోడ్ చేసుకొనే అవకాశాన్ని కల్పించినట్టు చెప్పారు. మంగళవారం వరకు 50 వేలకు పైగా విద్యార్థులు హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నట్టు తెలిపారు.
ఈసారి ఇంటర్ పరీక్షలు అత్యధిక మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో రాయబోతున్నారు. 9.47 లక్షల మంది విద్యార్థుల్లో 8.40 లక్షల మంది ఇంగ్లిష్ మీడియంలోనే హాజరవుతున్నారు. ఫస్టియర్లో 4.32 లక్షలు, సెకండియర్లో 4.09 లక్షలు ఇంగ్లిష్ మీడియంలో రాస్తుండగా, తెలుగు మీడియం ఫస్టియర్లో 45,376, సెకండియర్లో 50,673 విద్యార్థులు హాజరుకాబోతున్నారు. ఉర్దూ మీడియంలో ఫస్టియర్లో 4,544, సెంకడియర్లో 4,667 విద్యార్థులు హాజరవుతున్నారు. మరాఠీలో 198, హిందీలో 70, కన్నడలో 18 మంది పరీక్షలు రాయనున్నారు.
ఇంటర్ విద్యార్థులు పరీక్ష ప్యాడ్ చూపిస్తే ఆర్టీసీ బస్సు ఆపుతారని ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ తెలిపారు. ఇందుకు ఆర్టీసీకి ఆదేశాలిచ్చినట్టు పేర్కొన్నారు. బుధవారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులను పరీక్షాకేంద్రాలకు చేర్చడంలో భాగంగా ఆర్టీసీకి పలు సూచనలు చేసినట్టు తెలిపారు.