హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు బుధవారం వెలువడనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే, ఆ వార్తలను ఇంటర్ బోర్డు అధికారులు ఖండించారు. తప్పుడు ప్రచారమని కొట్టిపడేశారు. ఇంటర్ ఫలితాలు బుధవారం వెలువడవని బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ స్పష్టం చేశారు.
అయితే, ఇంటర్ పరీక్షలను మేలో నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవల మూల్యాంకనం ప్రక్రియ పూర్తయ్యింది. మిగతా లాంఛనాలను పూర్తి చేసేందుకు మరికొంత సమయం పట్టే అవకాశాలున్నాయి. అధికారిక వర్గాల సమాచారం మేరకు ఈ నెల 25లోగా ఫలితాలను ప్రకటించే అవకాశం ఉన్నది.
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ఈ నెల ఒకటో తేదీతో ముగిశాయి. కాగా, మూల్యాకనం సోమవారం నాటితో పూర్తయ్యింది. ప్రస్తుతానికి అధికారులు మార్కులను క్రోడీకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ప్రక్రియంగా ముగిసే సరికి మరో పది రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. మొత్తంగా ఈ నెలాఖరులోగా ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.