హైదరాబాద్ : తెలంగాణ విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యక్ష బోధనకు రావాలని విద్యార్థులను బలవంతం చేయొద్దు అని కోర్టు సూచించింది. ప్రత్యక్ష తరగతులు హాజరుకాని విద్యార్థులపై చర్యలు తీసుకోవద్దు. ప్రత్యక్ష తరగతులు నిర్వహించని విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవద్దు అని ప్రభుత్వానికి కోర్టు సూచించింది. ఆన్లైన్ లేదా ప్రత్యక్ష బోధనపై విద్యా సంస్థలే నిర్ణయించుకోవచ్చు అని కోర్టు తెలిపింది. ప్రత్యక్ష బోధన నిర్వహించే పాఠశాలలకు వారం లోగా మార్గదర్శకాలు జారీ చేయాలని విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఇక పాఠశాలలు పాటించాల్సిన మార్గదర్శకాలపై విస్తృతం ప్రచారం చేయాలని హైకోర్టు చెప్పింది.
గురుకులాలతో పాటు మిగతా హాస్టళ్లలో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు స్టే విధించింది. గురుకులాలు, విద్యాసంస్థల వసతిగృహాలు తెరవద్దని హైకోర్టు ఆదేశించింది. గురుకులాలు, హాస్టళ్లలో వసతులపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యక్ష బోధనపై పరస్పర విరుద్ధ లాభనష్టాలు ఉన్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో కొవిడ్ తీవ్రత ఇంకా కొనసాగుతోంది. సెప్టెంబరు లేదా అక్టోబర్ నెలలో మూడో దశ పొంచి ఉందని హెచ్చరికలు వస్తున్నాయని కోర్టు పేర్కొంది. విద్యాసంస్థలు తెరవకపోతే విద్యార్థులు నష్టపోతున్నారన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం రెండింటిని సమన్వయం చేసి చూడాలి అని కోర్టు సూచించింది. విచారణను అక్టోబరు 4కి కోర్టు వాయిదా వేసింది.