Minister Harish Rao | 2014 జూన్ 2 తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లో కాంపిటేటివ్ అథారిటీ కోటాలోని వందశాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అయితే, ఈ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థిస్తూ తీర్పు ఇవ్వడం శుభ పరిణామమని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడంతోపాటు, వాటిద్వారా అందుబాటులోకి వచ్చిన ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణ బిడ్డలకే దక్కేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనని స్పష్టమైందన్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎంబీబీఎస్ ‘బీ’ కేటగిరి సీట్లలో 85శాతం సీట్లను లోకల్ రిజర్వ్ చేయడం ద్వారా తెలంగాణ విద్యార్థులకు అదనంగా 1,300 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
హైకోర్టు తాజా తీర్పుతో మరో 520 మెడికల్ సీట్లు తెలంగాణ విద్యార్థులకు లభించనున్నాయి. ముందుచూపుతో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ రెండు నిర్ణయాలతో ఏటా 1,820 సీట్లు దక్కనున్నాయి. ఇది దాదాపు 20 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో సమానమని హరీశ్రావు పేర్కొన్నారు.