హైదరాబాద్ : తెలంగాణలోని మత్స్యకార సొసైటీ సభ్యులకు ప్రభుత్వం ఉగాది కానుక ఇచ్చింది. చేపల చెరువు లీజును ప్రస్తుతం ఉన్న ధరలకే కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు చేసిందని రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రి తలసాని ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. భేటీలో ప్రస్తుతం ఉన్న లీజు ధరలను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జీవో 268 ద్వారా పంచాయతీరాజ్ శాఖకు చెందిన చెరువుల్లో చేపల పెంపకం, వేటపై యాజమాన్య హక్కులను మత్స్యశాఖకు బదలాయిస్తూ ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. గతంలో శాశ్వతంగా నీరు నిల్వ ఉండే ఒక హెక్టార్కు రూ.400, ఎక్కువ కాలం నీరు నిల్వ ఉంటే హెక్టార్ రూ.200, తక్కువ కాలం పాటు నీరు నిల్వ ఉంటే హెక్టార్కు రూ.60 చొప్పున లీజు వసూలు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం అదే లీజు మొత్తాన్ని వసూలు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, మత్స్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యాను మంత్రి ఆదేశించారు.
మత్స్యకారుల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూతను అందిస్తూ ప్రోత్సహిస్తుందని అన్నారు. మత్స్యకారుల ఆర్థిక పరిస్థితిని పరిగణలో ఉంచుకొని, ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వారిని ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం అందించేందుకు ప్రస్తుతం ఉన్న ధరలనే కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ నిర్ణయంతో 4,793 మత్స్య సొసైటీల్లోని 3.54 లక్షల మంది మత్స్యకారులు లబ్ధి చేకూరుతుందని మంత్రి వివరించారు.