హైదరాబాద్ : నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రూప్-4 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. 9,168 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనున్నది. ఈ మేరకు పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి హరీశ్రావు తెలిపారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రూ.9,168 గ్రూప్-4 పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు పోస్టులను భర్తీ చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఈ సందర్భంగా ఆశావహులకు శుభాకాంక్షలు తెలిపారు.
గ్రూప్-4 ఉద్యోగాల్లో ముఖ్యంగా మూడు కేటగిరీలకు సంబంధించిన పోస్టులున్నాయి. ఇందులో ఎక్కువగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 6,859, వార్డు ఆఫీసర్ పోస్టులు 1,862, పంచాయితీరాజ్శాఖలో భారీ స్థాయిలో 1,245 పోస్టులు, 429 జూనియర్ అకౌంటెంట్ పోస్టులు, 18 జూనియర్ ఆడిటర్ పోస్టులు ఉన్నాయి. రెవెన్యూ శాఖలో 2,077 జూనియన్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ పరిపాలన అనుమతి ఇచ్చింది. ఇంతకు ముందు ప్రభుత్వం గ్రూప్-2లో 663 పోస్టులు గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా మరికొన్ని కేటగిరీ పోస్టులను చేరుస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోస్టులు భారీగా పెరిగాయి.