మహబూబాబాద్ : జిల్లాలోని తొర్రూర్ మండలం, వెలికట్ట గ్రామంలో పిడుగుపాటుకు గురై సాయమ్మ, అమరేశ్వరి అనే ఇద్దరు మహిళలు మృతి చెందడం పట్ల రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విచారం వ్యక్తం చేశారు. మహిళల మృత దేహాలను మహబూబాబాద్ హాస్పిటల్ సందర్శించి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. పిడుగుపాటుకు గురైన మరో మహిళకు మెరుగైన వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు మంత్రి వ్యక్తిగతంగా రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ప్రభుత్వం తరపున కుటుంబానికి రూ. 6 లక్షలు అందుతాయన్నారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు.