రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్
రఘునాథపాలెం, నవంబర్ 19: బస్తీల్లోని పేదల సుస్తీ పోగొట్టేందుకు సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానలను ఏర్పాటు చేశారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం నగరంలోని వైఎస్సార్ నగర్, కొత్తగూడెం ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలను శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. పేదలకు వైద్య సేవలను అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.
ఈ దవాఖానల్లో నిపుణులైన వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది అందుబాటులో ఉండి ఉచితంగా వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. అన్ని రకాల మందులు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. బస్తీ దవాఖానల్లో అన్ని రకాల పరీక్షలను, తెలంగాణ డయాగ్నస్టిక్స్ ద్వారా 57 రకాల పరీక్షలను ఉచితంగా చేస్తారని వివరించారు. ప్రైవేటు దవాఖానలకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని సూచించారు. నగరంలో ఇప్పటికే అనేక డివిజన్లలో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ వీపీ గౌతమ్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, కేఎంసీ మేయర్ పునకొల్లు నీరజ తదితరులు పాల్గొన్నారు.