TS Edcet | హైదరాబాద్ : టీఎస్ ఎడ్సెట్ -2024 ప్రవేశ పరీక్ష విజయవంతంగా నిర్వహించారు. ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ విధానంలో గురువారం నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షకు 87 శాతం మంది హాజరైనట్లు టీఎస్ ఎడ్ సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఆలువాల రవి ప్రకటించారు.
టీఎస్ ఎడ్సెట్కు 33,879 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీరికి రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. సెషన్-1లో 16,929 మందికి గానూ 14,633 మంది, సెషన్-2లో 16,950 మందికి గానూ 14,830 మంది అభ్యర్థులు హాజరయ్యారు. తొలి సెషన్ను ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్ను మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 79 సెంటర్లలో పరీక్షల నిర్వహణ కొనసాగింది.