హైదరాబాద్ : టీఎస్ ఎడ్సెట్-2021 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 19 నుంచి జూన్ 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఆగస్టు 24, 25 తేదీల్లో ఎడ్సెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ఏడాది అన్ని మెథడాలజీలకు ఒకే ప్రశ్నాపత్రం ఉంటుందని ఎడ్సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఏ రామకృష్ణ వెల్లడించారు. ఎడ్సెట్ వెబ్సైట్లో సిలబస్, నమూనా ప్రశ్నాపత్రం అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
బీఈడీ కోర్సులో పలు మార్పులుచేస్తూ విద్యాశాఖ స్పెషల్సీఎస్ చిత్రారామచంద్రన్ సోమవారం జీవో-14 జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇక నుంచి బీఏ, బీకాం, బీఎస్సీవారితో పాటు బీబీఏ, బీబీఎం, బీసీఏ విద్యార్థులు కూడా బీఈడీ కోర్సుల్లో చేరవచ్చని జీవోలో పేర్కొన్నారు. వీరు డిగ్రీలో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఇంజినీరింగ్ విద్యార్థులు ఎడ్సెట్ రాసేందుకు ఇప్పటివరకు 55 శాతం మార్కులు అర్హతగా ఉండగా, తాజాగా 50 శాతానికి తగ్గించారు. డిగ్రీలో కేవలం కెమిస్ట్రీ సబ్జెక్టు ఒక్కటే చదివినా బీఈడీ ఫిజికల్ సైన్స్ మెథడ్లో చేరేందుకు అవకాశం కల్పించారు.
ఈ సందర్భంగా టీఎస్ ఎడ్సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఏ రామకృష్ణ ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ ప్రవేశపరీక్షలో ఇప్పటివరకు మెథడ్స్ విధానాన్ని రద్దుచేసి అందరికీ ఒకే కామన్పరీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రవేశపరీక్షలో మెథడ్స్ లేకపోయినా బీఈడీ ప్రవేశాలు మాత్రం మెథడ్స్ ఆధారంగానే జరుగుతాయని వెల్లడించారు. వారంలోగా బీఈడీ నోటిఫికేషన్ విడుదలచేసి దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. ప్రతి వంద బీఈడీ సీట్లలో గణితానికి 25 శాతం, ఫిజికల్ సైన్స్, జీవశాస్త్రం మెథడ్స్కు కలిపి 30 శాతం సీట్లు కేటాయించారు. సోషల్ సైన్స్కు 45 శాతం సీట్లను కేటాయించారు. దీంట్లో ఇంగ్లిష్, ఓరియంటల్ లాంగ్వేజెస్ వారికి 15 శాతం సీట్లుకు మించకుండా ప్రవేశాలు కల్పిస్తారు.