హైదరాబాద్ : కొవిడ్ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు జాగ్రత్తలు పాటించడం ద్వారా కొవిడ్ కొత్త వేరియంట్కు దూరంగా ఉండవచ్చన్నారు. డెల్టా కంటే ఒమిక్రాన్ వేరియంట్ ఆరు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందన్నారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయన్నారు. దక్షిణాఫ్రికాలో 8 నుంచి 16 శాతానికి కేసులు పెరిగాయని, కొత్త కేసుల్లో 75శాతం ఒమిక్రాన్ కేసులు ఉన్నాయని చెప్పారు.
వైరస్ తీవ్రత తెలిసేందుకు మరో వారం రోజులు పడుతుందని పేర్కొన్నారు. కేసులు పెరిగినా ఆసుపత్రుల్లో చేరికలు, మరణాలు పెరగట్లేదన్నారు. రాష్ట్రంలోకి విదేశాల నుంచి వచ్చిన వారికి ప్రతి రోజూ శంషాబాద్ విమానాశ్రయంలోనే పరీక్షలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఒమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచి వచ్చిన 979 మందికి పరీక్షలు నిర్వహించామని, 13 మందికి పాజిటివ్గా తేలడంతో వారిని క్వారంటైన్కు తరలించినట్లు వివరించారు. వారికి ఒమిక్రాన్ ఉందో లేదో ఒకటి రెండు రోజుల్లో తెలిసిపోతుందన్నారు.
ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో కొవిడ్ నిబంధనలు మళ్లీ కాస్త మెరుగుపడ్డాయని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. కొవిడ్ నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం ముఖ్యమన్నారు. ఒకట్రెండు నెలల్లో దేశంలోనూ కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందన్నారు. ఇప్పటి వరకు దేశంలో ఐదు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ మనల్ని మనం కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామన్నారు.
వైద్య సిబ్బంది, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఒమిక్రాన్ సోకిన వారిలో తీవ్ర లక్షణాలు కనిపించడం లేదని వెల్లడించారు. ఒమిక్రాన్ కేసుల దృష్ట్యా వ్యాక్సినేషన్ వేగవంతం చేసినట్లు చెప్పారు. శనివారం ఒకే రోజు 3.7లక్షల టీకా డోసుల పంపిణీ చేశామని, 92శాతం మందికి మొదటి డోసు పూర్తయిందని, 48శాతం మందికి రెండు డోసులు పూర్తయ్యిందని వివరించారు. డిసెంబర్ 31లోపు వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి కావాలన్నారు.
జనవరి, ఫిబ్రవరిలో భారీగా కేసులు పెరిగే ఛాన్స్
రాష్ట్రంలో జనవరి జనవరి 15 తర్వాత రాష్ట్రంలో కేసులు పెరిగే అవకాశం ఉందని డీహెచ్ పేర్కొన్నారు. ఫిబ్రవరిలో భారీగా కేసులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ క్రమంలో ప్రజలంతా తప్పకుండా నిబంధనలు పాటించాలన్నారు. పండుగల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. ఒమిక్రాన్ సోకిన వారిలో ఎక్కువగా లక్షణాలు ఉండడం లేదన్నారు. ఒమిక్రాన్ సోకితే తీవ్ర ఒప్పు నొప్పులు, తలనొప్పి, నీరసంగా ఉంటుందన్నారు.
కేసులు దాస్తున్నామన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. కొవిడ్ను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటోందన్నారు. ప్రతి రోగికి చికిత్స అందిస్తున్నామన్న ఆయన.. తప్పుడు వార్తలతో వైద్య, ఆరోగ్యశాఖ మనోస్థైర్యం తగ్గుతుందన్నారు. కొవిడ్ కంటే తప్పుడు వార్తలు ప్రమాదకరమన్నారు. తప్పుడు వార్తలతో ఆందోళన పెంచుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు.