Revanth Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి సోమవారం ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. కేంద్ర మంత్రి అమిత్షాకు సంబంధించిన ఫేక్ వీడియోల కేసులో రేవంత్కు పోలీసులు ఈ సమన్లు అందించారు. మే 1న విచారణకు ఢిల్లీకి రావాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన ఉపయోగించిన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ను సైతం విచారణకు తీసుకురావాలన్నారు. హైదరాబాద్లోని గాంధీ భవన్కు చేరుకున్న ఢిల్లీ పోలీసులు సమన్లు అందజేశారు.
హోం మంత్రిత్వ శాఖ, బీజేపీ పార్టీ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రేవంత్కు పోలీసులు సమన్లు పంపడం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ పోలీసుల ప్రత్యేక బృందం ఐటీ చట్టంలోని నిబంధనల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇదిలా ఉండగా.. అమిత్ షా ఇటీవల తెలంగాణ పర్యటించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ప్రసంగిస్తూ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకు చెందిన ఆ హక్కులను తిరిగి వారికే ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు.
అయితే, షా ప్రసంగాన్ని పలువురు వక్రీకరించి.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పినట్లు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీనిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు ఫేక్ వీడియోపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సైతం స్పందించింది. ఈ మేరకు నకిలీ వీడియోలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. హోంశాఖ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపింది. అదే సమయంలో ఈ వ్యవహారంలో పలు రాష్ట్రాల్లోనూ కేసులు నమోదయ్యాయి.