హైదరాబాద్ : రాష్ట్రంలోని పలు సాగునీటి ప్రాజెక్టులకు రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన గత ఆరు గంటలుగా సమావేశం కొనసాగుతున్నది. ఇరిగేషన్ శాఖపై కేబినేట్ సుదీర్ఘంగా చర్చించిన కేబినెట్, పలు అంశాలను ఆమోదించింది. సిద్ధిపేట జిల్లాలో మల్లన్నసాగర్ నుంచి తపాస్పల్లి జలాశయానికి లింక్ కాలువ తవ్వకానికి రూ.388.20 కోట్లకు ఆమోదం తెలిపింది. తపాస్పల్లి జలాశయం కింద జిల్లాల్లో 1,29,630 ఎకరాలకు సాగునీరు అందనున్నది. అలాగే వనపర్తి జిల్లాలో గోపాల్పేట మండలం బుద్దారం గ్రామంలో ఉన్న పెద్ద చెరువు పునరుద్ధరణ పనులకు రూ.44.71కోట్లకు ఆమోదముద్ర వేసింది.
మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించ తలపెట్టిన ఘన్పూర్ కాలువ పనులకు రూ.144.43 కోట్లకు మంత్రివర్గం సమ్మతించింది. కాలువ ద్వారా ఘన్పూర్, అడ్డాకుల మండలాల్లో 25వేల ఎకరాలకు సాగునీరందనున్నది. ఆదిలాబాద్ జిల్లాలో పెన్ గంగా నదిపై నిర్మాణం అవుతున్న చనాకా కోరాటా బ్యారేజీకి సంబంధించి రూ.795.94 కోట్లకు అంచనా వ్యయాన్ని సవరించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ప్రాజెక్టులో ఇప్పటికే బ్యారేజీ నిర్మాణం పూర్తయ్యింది. పంప్హౌస్ నిర్మాణం కొనసాగుతున్నది. ఈ ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో భీంపూర్, జైనథ్, భేలా, ఆదిలాబాద్ మండలాల్లో 50వేల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. మెదక్ జిల్లాలో నిజాం కాలంలో నిర్మించబడిన ఘన్పూర్ ఆనకట్ట కాలువల వ్యవస్థను గతంలో ఆధునీకరించడం జరిగింది. అందులో మిగిలిపోయిన మరికొన్ని పనులను చేపట్టేందుకు రూ.50.32 కోట్లతో పరిపాలనా అనుమతుల జారీకి ఆమోదముద్ర వేసింది. ప్రాజెక్టు కింద మెదక్ జిల్లాలో సుమారు 25వేల ఎకరాల్లో పంటలకు నీరందుతుంది.
వనపర్తి, గద్వాల జిల్లాల్లో 11 చెక్ డ్యామ్ల నిర్మాణానికి మంత్రిమండలి ఆమోదించింది. రూ.27.36కోట్ల పరిపాలనా అనుమతులు ఇచ్చింది. వనపర్తి జిల్లాలో పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలో ఉన్న గోపాల సముద్రం చెరువు పునరుద్ధరణ, సుందరీకరణ పనుల కోసం రూ.10.01 కోట్లు మంజూరు చేసింది. గద్వాల జిల్లాలో ప్రతిపాదించిన నలసోమనాద్రి గట్టు ఎత్తిపోతల పథకానికి సవరించిన అంచనా వ్యయం రూ.6.69 కోట్లకు అనుమతి, ప్రాజెక్టు పనులకు టెండర్లు పిలిచేందుకు అంగీకరించింది. సూర్యాపేట జిల్లాలో చింతలపాలెం మండలం, వెల్లటూరు గ్రామం వద్ద ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ నుంచి నిర్మించ తలపెట్టిన ఎత్తిపోతల పథకానికి, పాల్కేడ్ మండలం గుండెబోయిన గూడెం గ్రామం వద్ద జాన్ పహాడ్ బ్రాంచ్ కెనాల్ నుండి నిర్మించ తలపెట్టిన ఎత్తిపోతల పథకాలకు రూ.16.23 కోట్లకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
సంగారెడ్డి జిల్లాలో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు నిధుల సేకరణకై కంపనీస్ ఆక్ట్(COMPANIES ACT), 2013 ప్రకారం మంజీరా లిఫ్ట్ ఇరిగేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. కార్పొరేషన్కు ఇరిగేషన్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ లేదంటే ప్రిన్సిపల్ సెక్రెటరీ చైర్మన్గా వ్యవహరిస్తారు. ఈఎన్సీ, (GENRAL), ఈఎన్సీ (GAJWEL), ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి, ఇరిగేషన్ శాఖ సంయుక్త కార్యదర్శి, సంగారెడ్డి చీఫ్ ఇంజినీర్ డైరెక్టర్లుగా వ్యవహరించనున్నారు.
దేవాదుల పథకంలో భాగంగా ఎత్తయిన ప్రాంతాలకు సాగు నీరు అందించడానికి గండి రామారం చెరువు నుంచి కన్నారం చెరువు వరకు పంప్హౌస్, కాలువ పనులకు, గుండ్ల సాగర్ నుంచి లౌక్య తండా వరకు పైప్ లైన్ పనులకు, నశ్కల్ జలాశయం వద్ద పంప్ హౌస్ నిర్మాణానికి మొత్తం రూ. 104.92 కోట్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.