హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ మధ్యాహ్నం 12.10 గంటలకు శాసనమండలి, శాసనసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అధ్యక్షతన, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన రెండుచోట్ల సభా నిర్వహణ సలహా కమిటీ (బీఏసీ) సమావేశాలు జరుగనున్నాయి. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి? ఎన్ని బిల్లులను సభలో ప్రవేశపెట్టాలి? వంటి విషయాలపై బీఏసీ సమావేశాల్లో సభ్యులు చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
ఈ సమావేశాల్లోనే సోమవారం (ఈ నెల 6న) 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. అసెంబ్లీ సమావేశాలు సజావుగా నిర్వహించేందుకు, ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండాఉన్నతాధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమయ్యే సమావేశాల కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు.
5న రాష్ట్ర క్యాబినెట్ సమావేశం
ఈ నెల ఐదో తేదీన (ఆదివారం) ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన ప్రగతిభవన్లో రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరుగనున్నది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్పై క్యాబినెట్ చర్చించి, ఆమోదం తెలుపనున్నది.