హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): ‘నమస్తే తెలంగాణ’ చెప్పిందే నిజమైంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ఉమ్మడి ప్రాజెక్టులకు సంబంధించి 15 ఔట్లెట్లను తెలంగాణ సర్కారు కేంద్రానికి అప్పగిస్తున్నదని, ఈ మేరకు ఉభయ తెలుగు రాష్ర్టాలు అంగీకరించాయని జనవరి 17న ‘నమస్తే తెలంగాణ’ ఓ కథనంలో స్పష్టంగా పేర్కొన్నది. ప్రాజెక్టులను అప్పగించడమే తెలంగాణ హక్కులకు విఘాతం కలిగించడమేనని హెచ్చరించింది. ఈ వార్తలో ఎంతమాత్రమూ నిజం లేదని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఇటీవల నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొట్టిపడేశారు. గురువారం జరిగిన సమావేశంలో మాత్రం ప్రాజెక్టుల అప్పగింతకు ప్రభుత్వం అంగీకారం తెలపడం గమనార్హం. శ్రీశైలం, నాగార్జునసాగర్ ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించాలని జనవరి 17న నిర్వహించిన సమావేశంలో కేంద్రజలశక్తిశాఖ స్పష్టంగా చెప్పింది. అందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అంగీకరించాయి. అంతేకాదు, ప్రాజెక్టుల అప్పగింతకు తెలంగాణ అంగీకరించినట్టు సమావేశ మినిట్స్లో జలశక్తిశాఖ స్పష్టంగా పేర్కొంది. అయినప్పటికీ అలాంటిదేమీ లేదని తెలంగాణ సర్కారు ఎదురుదాడికి దిగింది. గత ప్రభుత్వంపై నిందలు మోపే ప్రయత్నం చేసింది. తాజాగా ప్రాజెక్టును కేంద్రానికి ధారాదత్తం చేసింది.
ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్తున్నారని జనవరి 17న ‘నమస్తే’లో ప్రచురితమైన కథనం
ప్రాజెక్టుల అప్పగింతపై ‘నమస్తే’తోపాటు పలు పత్రికల్లో వచ్చిన కథనాలపై గతంలో ఓ సమీక్షలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగిస్తామన్న వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని స్పష్టం చేశారు. కేంద్రం చర్చలు జరపడం నిజమే అయినా తామింకా సమాధానం చెప్పలదేని పేర్కొన్నారు. ఈ విషయంలో కేంద్ర జలశక్తిశాఖకు ఎలాంటి హామీ ఇవ్వకపోయినా తాము నెల రోజుల్లో అప్పగించనున్నట్టు కేంద్రమే ప్రచారం చేసిందని ఆగ్రహం వ్యకం చేశారు.
కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి వాటాలు, కృ ష్ణాపై ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై సమావేశం ఏర్పాటు చేయాలని ఇటీవల రేవంత్రెడ్డి ఆర్భాటంగా ప్రకటించారు. అఖిలపక్ష సమావేశంలో చర్చించిన తర్వాత ఈ విషయంలో నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించినట్టు వస్తున్న వార్తలను ఈ సందర్భంగా సీఎం ఖండించారు. అయితే, ఇవే వీ లేకుండానే తాజా సమావేశంలో ప్రాజెక్టుల అప్పగింతకు ప్రభుత్వం అంగీకరించింది.