హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పర్యటనను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్వీ ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా వర్సిటీ ప్రాంగణంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను టీఆర్ఎస్వీ నాయకులు దహనం చేశారు.
అనంతరం టీఆర్ఎస్వీ నాయకులు మాట్లాడుతూ.. ఓయూలో రాహుల్ గాంధీ అడుగుపెడితే అడ్డుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను పరామర్శించిన తర్వాతే రాహుల్ ఓయూకు రావాలని డిమాండ్ చేశారు. ఉద్యమ సమయంలో ఏనాడూ గుర్తుకు రాని ఉస్మానియా యూనివర్సిటీ.. ఇవాళ ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని ప్రశ్నించారు. ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టే పరిస్థితి తేవొద్దని సూచించారు.
రాహుల్ దిష్టిబొమ్మ దహనం కార్యక్రమంలో టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దమ్మ రమేష్, కార్యదర్శులు జంగయ్య, రాజేష్ నాయక్, బొల్లు నాగరాజు, శివ, మేకల సందీప్, నాగేంద్రబాబు, రవి, నాగేంద్ర రావు తదితరులు పాల్గొన్నారు.