హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): మునుగోడులో టీఆర్ఎస్ విజయదుందుభి మోగించనున్నదని, బీజేపీది మూడో స్థానమేనని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. సీఎం కేసీఆరే తమ భరోసా అని, తమ డీఎన్ఏ తెలంగాణేనని, తెలంగాణ మాడల్తోనే బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించనున్నదని చెప్పారు. శనివారం ఓ చానల్ ఇంటర్యూలో మునుగోడు ఎన్నికతోపాటు సమకాలీన రాజకీయాలపై కేటీఆర్ స్పందించారు. ఆ విషయాలు కేటీఆర్ మాటల్లోనే..
అన్నిచోట్లా అభివృద్ధి..
మిషన్ కాకతీయతో అన్ని జిల్లాల్లోని చెరువులు బాగుచేశాం. మిషన్ భగీరథతో రాష్ట్రంలోని ఇండ్లన్నింటికీ మంచినీళ్లిచ్చాం. మండలా ల నుంచి జిల్లాకు రెండు లేన్లు, జిల్లా నుంచి రాజధానికి నాలుగులేన్లు.. అన్ని నియోజకవర్గాల్లో ఆర్అండ్బీ రోడ్లు వేసేలా ప్రణాళికలు రూపొందించాం. మనఊరు -మనబడి కార్యక్రమంలో 26 వేల స్కూళ్లను అభివృద్ధి చేస్తు న్నాం. రాష్ట్రం ఏ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాలన్నీ అమలుకాలేదని ఏ ప్రతిపక్ష ఎమ్మె ల్యే నిరూపించినా నేను రాజీనామా చేసేందుకు సిద్ధం. హుజూరాబాద్ పోదామా? దుబ్బాక పోదామా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్న దగ్గరికి పోదామా? ఎక్కడికైనా నేను సిద్ధం. ప్రతి మున్సిపాలిటీకి, జీపీకి నిధులిచ్చాం. ఇటీవలే చండూరు మున్సిపాలిటీకి కేంద్రం స్వచ్ఛసర్వేక్షన్ అవార్డు ఇచ్చింది. మేం సక్రమంగా పనిచేయకపోతే సిరిసిల్ల, చండూరుకు అవార్డు ఎలా వస్తుంది? మా ఎమ్మెల్యే గెలవకపోయినా ములుగును జిల్లా చేశాం. వైద్య కళాశాల ఇచ్చాం. మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేశాం.
తట్టెడు మట్టి తీయలేదు..
మా కుటుంబంలో చాలామంది నిర్వాసితులున్నారు. నిర్వాసితుల సమస్యలు తెలుసు. 67 ఏండ్లలో అత్యధికంగా ఏలింది స్రవంతి గారు న్న (మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి) పార్టీయే. స్వయంగా వారి తండ్రి గోవర్ధన్రెడ్డి సాగునీటి మంత్రిగా పనిచేశారు. చర్లగూడెం, శివన్నగూడెం ప్రాజెక్టుల్లో వాళ్లు తట్టెడు మట్టి తీయలేదు. అయినా మమ్మల్ని ప్రశ్నిస్తే.. నవ్వాలో ఏడ్వాల్నో తెలియడం లేదు. ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేను వెంటబెట్టుకొని ప్రాజెక్ట్ను పూర్తిచేస్తాం. నిర్వాసితుల సమస్యను పరిష్కరిస్తాం.మునుగోడును దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తాం.
ఈసీనీ బీజేపీ నేతలు ఆడిస్తున్నారు
ఎలక్షన్ కమిషన్ (ఈసీ) అధికారులను బీజేపీ నేతలు ఆడిస్తున్నారు. కారు గుర్తును పోలిన గుర్తులివ్వద్దంటే ఈసీనే రోడ్డు రోలర్ గుర్తును తొలగించింది. రిటర్నింగ్ అధికారి విచక్షణతో ఆ గుర్తును తొలగిస్తే ఆయన్ను సస్పెండ్ చేశారు. ఈసీ తొలగించిన గుర్తును మళ్లీ బీజేపీయే పెట్టించింది. ఇలాంటి పోకడలకు ప్రజలకు దీటుగా జవాబు చెప్తారు.
బీసీలను గౌరవించింది మేమే..
బొమ్మగాని ధర్మభిక్షం తర్వాత టీఆర్ఎస్సే భువనగిరి నుంచి రెండుసార్లు బీసీ అభ్యర్థికి ఎంపీ టికెట్ ఇచ్చింది. బడుగుల లింగయ్యయాదవ్ను రాజ్యసభ సభ్యుడిని చేసుకున్నం. కోదాడలో ఉత్తమకుమార్రెడ్డి సతీమణి మీద బొల్లం మల్లయ్యయాదవ్, నాగార్జునసాగర్లో జానారెడ్డి మీద నోముల భగత్కు టికెట్ ఇచ్చి గెలిపించుకున్నాం. మునుగోడులో అన్నిరకాల సర్వేల తర్వాతే ప్రభాకర్రెడ్డికి టికెట్ ఇచ్చాం.
మాంసపు ముద్దల్లా చూస్తున్నారు
నాకున్న అవగాహన ప్రకారం రాజ్గోపాల్ మునుగోడులో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడుతున్నారు. ఈ నెల 14న సుశీ ఇన్ఫ్రా నుంచి రూ.2 కోట్లు చౌటుప్పల్, పంతంగిలోని 17 మందికి, 18న రూ.కోటిన్నర పబ్బు రాజుగౌడ్, అరుణకు అనే వ్యక్తులకు, తాజాగా శనివారం (29న) రూ.కోటి చొప్పున రూ.4.5 కోట్లు సుశీ ఇన్ఫ్రా బ్యాంక్ ఖాతా నుంచి మునుగోడులోని ఓటర్లు, నాయకులకు బదిలీ అయ్యాయి. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తున్నాం.
పాదయాత్రతో హెల్త్ .. ఫిట్నెస్ బాగుపడుద్ది..
పాదయాత్ర చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. ఫిట్నెస్ బాగుపడుద్ది.. అంతేకానీ కాంగ్రెస్ బాగుపడదు. ఆయన (రాహుల్గాంధీ) చేయాల్సింది భారత్ జోడో యాత్ర కాదు.. కాంగ్రెస్ జోడో యాత్ర. మహారాష్ట్ర తర్వాత ఎన్నికలున్న గుజరాత్కు కాకుండా.. మధ్యప్రదేశ్కు వెళ్తున్నారు. అంటే గుజరాత్ ఎన్నికలను రాహుల్గాంధీ వదిలేసుకున్నారా? అక్కడ పార్టీని గాలికొదిలేశారా? ఎన్నికలున్న చోటికి కాకుండా మరో రాష్ట్రంలో పాదయాత్ర చేస్తే ఏమనుకోవాలి? ఆయన్ను అమెథీలోనే ఎంపీగా పనికిరారని పంపించి వేశారు. ఆయనేం చేయగలరు?
బీజేపీ నేతలమీద దాడులెందుకు జరగవు?
పక్కనే ఉన్న కర్ణాటక విద్యాశాఖలో 40 శాతం కమీషన్లు తీసుకొంటున్నారని స్కూల్స్ అసోసియేషన్ వాళ్లు ప్రధానికి లేఖ రాసినా.. కాంట్రాక్టర్లు విధానసభ ముందు ధర్నా చేసినా.. 30 శాతం కమిషన్ తీసుకొంటున్నారని హిందుత్వానికి ప్రతీక అయిన మఠాధిపతులు చెప్పినా.. సాక్షాత్తూ రూ.2,500 కోట్లు ఇస్తే సీఎం పదవీ ఇస్తామని మా అధిష్ఠానం చెప్పిందని ఓ బీజేపీ ఎమ్మెల్యే చెప్పినా.. నరేంద్రమోదీ వల్లే అదానీకి ప్రాజెక్టు ఇచ్చామని శ్రీలంక విద్యుత్తుశాఖ చెప్పినా ఈడీలుండవు.. కేసులుండవు. ఇంత చెప్పినా.. బీజేపీ నేతలమీద దాడులెందుకు జరగవు? ఈడీ.. మోదీ.. బోడీలొచ్చినా మేం భయపడం.
వేటకుక్కల్లా మేం చేర్చుకోలే..
ఎమ్మెల్యే అమ్ముడుపోవడం వల్లే మునుగోడులో ఉప ఎన్నిక వచ్చింది. కుబేరుడినే బీజేపీ జేబులో పెట్టుకొన్నది. సీబీఐ, ఈడీలను పెట్టి.. మేం వేటకుక్కల్లా చేర్చుకోలేదు. రాజకీయంగా అవకాశాలు కల్పిస్తామని.. అభివృద్ధి చేస్తామని మాత్ర మే హామీలిచ్చి పార్టీలో చేర్చుకున్నాం. గతంలో రాజగోపాల్ టీఆర్ఎస్లో చేరుతానన్నారు. ఆయన పూటకో మాట మాట్లాడతారని మేం చేర్చుకోలేదు. వాళ్లే.. పులిచింతల వద్దంటారు.. మోటర్లను తంతారు. మళ్లీ అదే పులిచింతల కాంట్రాక్టులు పొందుతారు. మోదీ ఇల్లిల్లు తిరిగినా రాష్ట్రంలో బీజేపీ గెలవదన్నది ఈ రాజగోపాల్రెడ్డే. అయినా ఆయన్ను బీజేపీలో చేర్చుకున్నారు. అదానీని కాదని రాజ్గోపాల్రెడ్డి కాంట్రాక్ట్ పొందారు. బీజేపీ పెద్దల ఆశీర్వాదం లేనిదే అదానీని కాదని కాంట్రాక్ట్ వస్తుందా? బేరం కుదిరిన తర్వాతే అన్నదమ్ములిద్దరు పార్టీ మారేందుకు సిద్ధపడ్డారు. బెదిరించి పార్టీలో చేర్చుకోవడం బీజేపీ నైజం. సుజనా, సీఎం రమేశ్ బీజేపీలో చేరగానే కేసులు మాయం. ఇది బీజేపీ నీతి.