జనగామ, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): జనగామ జిల్లా జఫర్గడ్ మండలం కూనూరులో బీజేపీ మూక మళ్లీ రెచ్చిపోయింది. ప్రజాసంగ్రామ యాత్రలో సీఎం కేసీఆర్పై బండి సంజయ్ అడ్డగోలుగా మాట్లాడటాన్ని తట్టుకోలేక గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త చాగంటి రాజు.. ‘జై కేసీఆర్- బండి గోబ్యాక్’ అని నినదించారు. దాన్ని తట్టుకోలేని బీజేపీ గూండాలు, బండి సంజయ్ బౌన్సర్లు పోలీసుల ఎదుటే రాజుపై కర్రలు, ఇనుపరాడ్లతో దాడికి తెగబడ్డారు. పిడిగుద్దులు గుద్దుతూ.. కిందపడేసి తన్నుతూ విచక్షణారహితంగా చితకబాదారు. రాజును తప్పించేందుకు పోలీసులు ప్రయత్నించినా అతడు స్పృహ కోల్పోయే వరకు కొట్టారు. తీవ్రంగా గాయపడిన రాజును పోలీసులు చికిత్స కోసం జనగామ జిల్లా ప్రధాన దవాఖానకు తరలించారు. తీవ్రంగా గాయపడిన రాజును ఎమ్మెల్యే రాజయ్య, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జడ్పీచైర్మన్ సంపత్రెడ్డి పరామర్శించారు. టీఆర్ఎస్ శ్రేణులపై బండి సంజయ్ దాడులను తీవ్రంగా ఖండించారు.