యాదాద్రి భువనగిరి: ప్రతిపక్షాలు ఎన్ని మాట్లాడిన హుజూరాబాద్ తమదేనని.. నియోజకవర్గ ప్రజలంతా సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. త్వరలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. మంత్రి తలసాని కుటుంబ సమేతంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అద్భుతమైన కళా ఖండంగా యాదాద్రి నిలువబోతుందని అన్నారు. మానవ సమాజం ఉన్నంతవరకు యాదాద్రి చరిత్రలో సీఎం కేసీఆర్ నిలిచిపోతారని చెప్పారు.
హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెలు శ్రీనివాస్ యాదవ్ను బానిసగా వర్ణించిన ఈటల రాజేందర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దళితబంధు రాష్ట్ర పథకమని, రాష్టంలో ప్రతి దళితునికి పథకం అందుతుందని స్పష్టం చేశారు. పథకం ప్రారంభదశలోనే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్రతిపక్షలు అంటున్నాయని, ఇది హాస్యాస్పదంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై ప్రశంసల వర్షం కురిపిస్తుంటే, ఇక్కడి ఎంపీ బండి సంజయ్ విమర్శించడం సిగ్గు చేటన్నారు. ఏడేండ్లుగా ఏ ఒక్క పథకాన్నైనా రాష్ట్రానికి తీసుకువచ్చారా అని ప్రశ్నించారు. ఓట్ల కోసం కేసీఆర్, కేసీఆర్ కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేస్తే ప్రజలు క్షమించరని అన్నారు.
యవతను లీడర్లను చేస్తున్నదే టీఆర్ఎస్ పార్టీ అని చెప్పారు. విద్యార్థి నాయకులైన గాదారి కిషోర్, బాల్క సుమన్, నోముల భగత్, తాజాగా గెల్లు శ్రీనివాస్ నాయకులుగా మారారని వెల్లడించారు. ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనా విధానమని చెప్పారు. తమ ప్రభుత్వం ఇప్పటివరకు 1.2 లక్షల ఉద్యోగులను భర్తీ చేసిందని, త్వరలో 50 నుంచి 60 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేస్తామని తెలిపారు.