ఫాసిస్ట్, ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూనే ఉంటాం
అగ్నిపథ్ ఆందోళనలకు కేంద్ర ప్రభుత్వమే కారణం
తెలంగాణ బిడ్డల రక్తం కళ్లచూసిన వారెవరూ బాగుపడలేదు
ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీలు దండె విఠల్, యెగ్గే మల్లేశం
హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): ఎనిమిదేండ్లుగా ప్రధాని మోదీ తీసుకున్న తుగ్లక్ నిర్ణయాల ఫలితమే ప్రస్తుత దేశవ్యాప్త నిరసనలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. అగ్నిపథ్పై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలకు కేంద్రమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. శనివారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీలు దండె విఠల్, యెగ్గే మల్లేశంతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలపై సుమన్ ధ్వజమెత్తారు. మోదీ తుగ్లక్ విధానాలపై, నియంతృత్వ చర్యలపై టీఆర్ఎస్ నిత్యం పోడుతూనే ఉంటుందని స్పష్టంచేశారు. ఈ విషయంలో తమతో ఎవరు కలిసి వచ్చినా, రాకపోయినా టీఆర్ఎస్ ధిక్కార బావుటా ఎగురవేస్తూనే ఉంటుందని తేల్చిచెప్పారు. 2016 నుంచి ఇప్పటివరకు మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ దేశప్రజలకు ఎలా అశనిపాతంలా మారాయో వివరించారు. నోట్లరద్దు, జీఎస్టీ, అట్రాసిటీ చట్టసవరణ, సీఏఏ, ఎన్ఐసీ, లాక్డౌన్, సాగు నల్లచట్టాలు, అగ్నిపథ్ ఇలా ప్రతీ అంశంలోనూ మోదీ తీసుకున్న నిర్ణయాలన్నీ దేశప్రజలను ఆందోళనకు గురిచేశాయని పేర్కొన్నారు.
ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకుండా ఆదానీ సేవలో మోదీ తరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్నిపథ్ ఆందోళనల్లో పాల్గొన్నందుకు రాకేశ్ అనే యువకుడి మృతికి కారణమైన బీజేపీకి పుట్టగతుల్లేకుండాపోతాయని అన్నారు. ‘మోదీ, బీజేపీ తూటాలకు తెలంగాణ బిడ్డ బలయ్యాడు. బీజేపీ ఇంతకు ఇంత అనుభవిస్తుంది. 1956 నుంచి 2014 దాకా వివిధ ఉద్యమాల్లో తెలంగాణ యువకులు రక్తాన్ని ధారపోశారు. తెలంగాణ యువత రక్తంతో చెలగాటమాడిన ఏ పార్టీ అయినా కాలగర్భంలో కలిసిపోయిన విషయం గుర్తుంచుకోవాలె’ అని హెచ్చరించారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి కుర్కురే రెడ్డిగా మారారని, పాన్షాప్ బండి సంజయ్లాగే ఆయన కూడా అగ్నిపథ్ ఆందోళనలపై నోరుపారేసుకుంటున్నాడని మండిపడ్డారు. వివిధ రాష్ర్టాల్లో ఏకకాలంలో జరిగిన ఆందోళనలకు కూడా టీఆర్ఎస్సే కారణమా? అని ప్రశ్నించారు. యూపీ, బీహార్, హర్యానాతోపాటు 12 రాష్ర్టాల్లో ఆందోళనలు జరిగాయని, తెలంగాణ మినహా మిగితావన్నీ బీజేపీ పాలిత రాష్ర్టాలేనని తెలిపారు. దేశయువత ఆందోళనలను అర్థం చేసుకోని దుర్మార్గులకు ప్రజలు గుణపాఠం చెప్తారని తెలిపారు. మోదీ ఇప్పటికైనా కండ్లుతెరిచి ఆర్మీ నియామకాల్లో పాత విధానాన్నే అనుసరించాలని లేదంటే దేశ యువత ఆగ్రహానికి బీజేపీ గురికాకతప్పదని హెచ్చరించారు. అగ్నిపథ్పై రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. రేవంత్రెడ్డి తలాతోకలేకుండా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
రక్షణరంగంపై రాజీపడొద్దు: దండె విఠల్
జై జవాన్- జై కిసాన్ నినాదానికి ప్రధాని మోదీ తూట్లు పొడుస్తున్నారని ఎమ్మెల్సీ దండె విఠల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రక్షణ రంగంలో కేంద్రం రాజీపడటం దుర్మార్గమన్నారు. అగ్నిపథ్ ద్వారా ఆర్మీని ప్రైవేటుపరం చేసేందుకు మోదీ కంకణం కట్టుకున్నారని విమర్శించారు.
మోదీకి మూడింది : యెగ్గే మల్లేశం
దేశ భవిష్యత్తుతో ఆటలాడుతున్న ప్రధాని మోదీకి మూడిందని ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం పేర్కొన్నారు. అగ్నిపథ్తో దేశం తగలబడిపోతుందని తెలిసినా కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని ఆయన మండిపడ్డారు. మోదీ ప్రజాసేవకుడిలా కాకుండా పచ్చి వ్యాపారిలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.