20 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
సంస్కరణలపై బీజేపీ నేతలను నిలదీయాలి
రజక, నాయీబ్రాహ్మణ, ఎంబీసీ సంఘాల పిలుపు
హైదరాబాద్/సిటీబ్యూరో, ఫిబ్రవరి14 /నల్లగొండ రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన విద్యుత్తు చట్టాలకు వ్యతిరేకంగా వివిధ కులవృత్తులు గళమెత్తుతున్నాయి. విద్యుత్తు సంస్కరణలు కులవృత్తులకు గుదిబండగా మారుతాయని ఆయా సంఘాల నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సమరశీల పోరాటాలు, ఉద్యమాల ద్వారా అడ్డుకునేందుకు రజక, నాయీబ్రాహ్మణ, బీసీ సంఘాలు సమాయత్తమవుతున్నాయి. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య నేతృత్వంలో న్యూఎమ్మెల్యే క్వార్టర్స్లో రజకసంఘాలు, కర్మన్ఘాట్లోని ఒక ఫంక్షన్ హాలులో నాయీబ్రాహ్మణ సంఘాలు సోమవారం విడివిడిగా సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను రూపొందించాయి. విద్యుత్తు సంస్కరణలపై బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ నెల 20 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ప్రైవేటీకరణ పేరిట దేశాన్ని కార్పొరేట్ శక్తులకు ధారదత్తం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీలను అణగదొక్కే కుట్రలకు తెరలేపిందని విమర్శించారు. సబ్సిడీల ఎత్తివేత, డిస్కమ్ల ప్రైవేటీకరణ, వ్యవసాయ మోటర్లకు మీటర్ల బిగింపు తదితరాలను అమలుచేయాలని నూతన విద్యుత్తు చట్టం ముసాయిదాలో పేర్కొనడం దారుణమని ధ్వజమెత్తారు. విద్యుత్తు చట్టం విషయంలో కేంద్రం, రాష్ట్ర బీజేపీ నేతలు అసత్య ప్రచారాలను మానుకోవాలని హితవు పలికారు. రజకులు, నాయీబ్రాహ్మణుల జోలికి వచ్చిన ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించలేదని హెచ్చరించారు. సమావేశంలో రాష్ట్ర రజక సంఘాల కో కన్వీనర్ కోట్ల శ్రీనివాస్, మహిళా విభాగం అధ్యక్షురాలు రాధ, రజక సంఘాల నేతలు ముదిగొండ మురళి, అశోక్కుమార్, నర్సింహ, హరినాథ్, తెలంగాణ రజక సంఘాల సమితి ముఖ్య సలహాదారు కొండూరు సత్యనారాయణ, నాయీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాలకిషన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెంబర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్తు సంస్కరణలను ఉపసంహరించుకోవాలి:
ఎంబీసీ రాష్ట్ర కో కన్వీనర్ కొండూరు సత్యనారాయణ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తలపెట్టిన విద్యుత్తు సంస్కరణలను ఉపసంహరించుకోవాలని ఎంబీసీ సంఘాల రాష్ట్ర కో కన్వీనర్ కొండూరు సత్యనారాయణ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన నల్లగొండలో రజక, నాయీబ్రాహ్మణ, ఎంబీసీ సంఘాల నేతలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం తీసుకొస్తున్న నూతన విద్యుత్తు చట్టం వల్ల తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న 250 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకాన్ని కూడా ఆయా వర్గాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు.బీసీలను కొట్టి కార్పొరేట్ శక్తులను బలోపేతం చేయడానికి కేంద్రం చేస్తున్న కుట్రలను ఎండగట్టాలని సూచించారు. సమావేశంలో ఎంబీసీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నాంపల్లి శ్రీనివాస్, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు చిలుకరాజు చెన్నయ్య, జిల్లా కన్వీనర్ లకడాపురం వెంకటేశ్వర్లు, ఎంబీసీ జిల్లా నాయకులు చింతల వెంకన్న, భీమనపల్లి నగేశ్, వెంకన్న, పుల్లయ్య, వెంకన్న, యాదగిరి పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్కు విద్యుత్తు ఉద్యోగుల మద్దతు
విద్యుత్తు సంస్థల ప్రైవేటీకరణకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీఎం కేసీఆర్కు తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్ శివాజీ, సెక్రెటరీ జనరల్ రామేశ్వర్శెట్టి మద్దతు ప్రకటించారు. విద్యుత్తు సంస్థల ప్రైవేటీకరణ వల్ల ఉద్యోగుల భవిష్యత్తు, వినియోగదారులపై పడే భారాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ మాట్లాడటం ప్రజలందరికీ మేలు చేస్తుందని పేర్కొన్నారు.