హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): ‘కారే రావాలి.. సారే గెలవాలి’ ఇదీ మునుగోడు జననినాదం. మునుగోడు నియోజకవర్గం అంతా మైకు మోతలతో.. జెండా ఎజెండాలతో హోరెత్తుతున్నది. పార్టీలన్నీ ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నాయి. మండల కేంద్రాలు, గ్రామ కూడళ్లలో ఏం మాట్లాడితే ఎవరు నొచ్చుకుంటారోనని జనం గుంభనంగా ఉంటున్నారు. కానీ పంట పొలాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో పరవశించిపోతున్నాయి. పత్తి చేలల్లో పనులు చేస్తూ.. దారిపొడవునా వెళ్లే వారిని పలకరిస్తే వారి మనసులో మాటను సన్నగా బయటికి చెప్తున్నారు. కాకపోతే నేరుగా తాము ఫలానా వారి వైపు ఉన్నామని చెప్పడంలేదు. కానీ తమది ‘మీరెక్కి వచ్చిన (కారు) గుర్తే’ నని నమ్మగర్భంగా చెప్తున్నారు. ‘మీరెవలో మాకు తెల్వదు.. ఏ పార్టీ వాళ్లో కానీ.. మా మతిల ఉన్నది.. మీకెందుకు చెప్పాలి’ అని ముందు మాట్లాడేందుకే నిరాకరిస్తున్నారు. కానీ వాళ్లకు నమ్మకం కుదిరితే మాట కలుపుతున్నారు. మనసులోని మాట చెప్తున్నారు. ‘ఇంతకంటే ఇంకెవలు చేస్తరు’ అని నిట్టూరుస్తున్నారు. ‘గెలిపిస్తే ఉన్నకాడ ఉండక.. పైసల మూటల కోసం బయటికి పోయి ఆగం చేస్తున్నడు’ అని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై నిప్పులు చెరుగుతున్నారు. ‘ఎన్నికలు కాంగనే అవుతలపడ్డడు. ఏనాడూ ఇటుమొఖం చూడలేదు. మళ్లిప్పుడు వచ్చి నేను పార్టీ మారిన నాకు ఓటేయండి’ అని తిరుగుతున్నడు అని ఈసడించుకొంటున్నారు. రాజ గోపాల్రెడ్డికి మూడోస్థానం దక్కితే అదే గొప్ప అని తేల్చి చెప్తున్నారు.
స్పష్టమైన అవగాహనతో మునుగోడు
ఈసారి మునుగోడు డిసైడ్ అయింది. వచ్చే నెల 3న జరిగే ఎన్నికల్లో ఎవరి వైపు ఉండాలో తేల్చుకున్నది. ‘ఎగిరేవాళ్లతో ఎగురం.. దుంకేవాళ్లతో దుంకం.. టైం వచ్చినప్పుడు ఏం చేయాల్నో గదే చేస్తం’ అని మునుగోడు తెగేసి చెప్తున్నది. ‘అన్నం పెట్టేవాడికి సున్నం పెట్టం.. ముసలోళ్లకు.. ముడిగోళ్లకు.. మొగుడు సచ్చినోళ్లకు నెలనెలా నౌకరిపడ్డట్టే పింఛన్లు వస్తాన్నై.. పిల్లపెండ్లికి పైసలు.. మగపిలగాడు పుడితే ఇంత.. ఆడపిల్ల పుడితే ఇంత అని లెక్కగట్టి ఇస్తున్నరు. ఇంటింటికీ నల్లానీళ్లు.. రైతుబంధు వస్తున్నది. రైతు చస్తే ఐదు లక్షలు వస్తున్నవి.. ఇంకేం కావాలయ్యా’ అని చండూరు మండలం నెర్మట గ్రామశివారులో చేనులో పత్తి ఏరుతున్న మల్లవ్వ అనే వృద్ధురాలు తన మనసులో మాట బయటపెట్టింది. కేసీఆర్ ఏం చేస్తడు.. ఇంకెంతకని చేస్తడు.. అని కూడా ఆ వృద్ధురాలు పేర్కొనడం విశేషం. ‘రాజీనామా చేసి ఏం ఉద్దరించిండు.. కోడెకత్తు పోరగాండ్లను తన దిక్కు తిప్పుకొని ఆగం చేస్తున్నడు’ అని సుగుణమ్మ అనే మహిళ బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డిపై తిట్ల దండకం అందుకొన్నారు. ‘కేసీఆర్ అన్నీ మంచిగనే చేస్తున్నడు.. కానీ శివన్నగూడెం ప్రాజెక్టు చేయాలె’ అని యాదయ్య అనే రైతు పేర్కొన్నారు. కమ్మగూడెం, గట్టుప్పల్, వెల్మకన్నే, మునుగోడు గ్రామాల్లోని పత్తి చేనుల్లో పనిలో నిమగ్నమైన రైతులు, కూలీలు వెల్లడిస్తున్న అభిప్రాయం ఇది.
కేసీఆర్ ఏం తక్కువ చేసిండు
ఇగ అందరూ తిరుగుతరు. ఊళ్లె ఎవలత్తె వాళ్లకే తలూపాలె. గిట్ల గట్ల ఏం చెప్తం. మతిల ఉన్నోళ్లకు అయితే ఏస్తం.. ‘సద్దితిన్న రేవు తలిస్తెనే అన్నం పుడ్తది’ కేసీఆర్ అన్నీ మంచిగనే చేస్తున్నడు. ఇంటికి పెద్దకొడుకు లెక్క చూసుకుంటున్నడు. ఏమో ఆ రోజు ఎట్లుంటదో చూడాలె. అయినా ఎవలకు తక్కువ జేసిండు. అన్నీ మంచిగనే చేస్తున్నడు. ఇండ్ల గెలిచి అండ్లకు పోయిండు.. ఇండ్ల ఏం ఎల్గవెట్టిండు.. అండ్లేం ఎల్గవెడ్తడు..? పైసలతోని రాత మారితే బాగానే ఉండు.
– మల్లమ్మ, నెర్మట
మళ్లా సారే గెలుస్తడు..
ఏమో అన్న సుట్టుపక్కల ఊళ్లల్ల మళ్లా సారే (కేసీఆర్) గెలుస్తడు. కారే వస్తది అంటున్నరు. అందిరికీ మంచిగనే చేత్తన్నడు. ఎవలను నాదాన్ చేయలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నకాడ కూడా దళితబంధు వచ్చిందట. మాకు అది రాలేదు. ఎమ్మెల్యేగా ఉండి మాకు ఇది కావాలె.. మా ప్రజలకు గీ సౌలతు చేయాల్నంటే చేయడా. ఉన్నకాడ ఉండి అడిగితే సారు ఇచ్చేది కావచ్చు. బయటికి ఎన్ని ముచ్చట్లు చెప్పినా మళ్లా సారే వస్తడు.
– గడ్డం యాదయ్య, చిన్నరైతు నెర్మట