హైదరాబాద్ / సిటీబ్యూరో, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): భారత జీవిత బీమా(ఎల్ఐసీ) అధికారులు, ఉద్యోగులు, ఏజెంట్లు దేశవ్యాప్తంగా ఉద్యమబాట పట్టనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 12 లక్షల మంది ఈ మూడు క్యాటగిరీల సిబ్బంది చేపట్టనున్న ఉద్యమానికి హైదరాబాద్ దిక్సూచి కానున్నది. ఎల్ఐసీ ప్రైవేటీకరణతోపాటు అధికారులు, ఉద్యోగులు, ఏజెంట్స్ వ్యవస్థలను నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టేందుకు దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 29న హైదరాబాద్లో నిర్వహించనున్న దేశవ్యాప్త ప్రతినిధుల సమావేశంలో ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నారు.
ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్లో ఎల్ఐసీ అధికారులు, ఉద్యోగులు, ఏజెంట్లు, ట్రేడ్యూనియన్ నాయకులతో జరిగిన సన్నాహక సమావేశంలో రాష్ట్ర ప్రణాళికాసంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ దిశానిర్దేశం చేశారు. ఎల్ఐసీ ఉద్యోగ కార్మిక వర్గం చేసే ఉద్యమానికి టీఆర్ఎస్ కార్మిక విభాగం అండగా నిలుస్తుందని ఆయన ప్రకటించారు. సన్నాహక సమావేశంలో ఎల్ఐసీ ఏజెంట్ల జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసచారి, రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.