హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ నాయకుడు పీఎల్ శ్రీనివాస్ రూపొందించిన ‘టీఆర్ఎస్ విశిష్ట పథకాల కరదీపిక’ పుస్తకాన్ని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు గురువారం ప్రగతిభవన్లో ఆవిష్కరించారు. ‘తెలంగాణ సాధించామన్న కీర్తే వెయ్యి జన్మల పుణ్యంగా భావిస్తున్నాను. సంపాదించుకున్న తెలంగాణను చక్కదిద్దుకునే అవకాశం కలగడమనే భాగ్యం కన్నా నా జీవితానికి మరేం కావాలి. తెలంగాణ అభివృద్ధి జరగాలి. అదే తప్ప నాకు మరో ఆలోచన లేదు’ అన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలతో మొదలైన ఈ పుస్తకం రాష్ట్రంలోని సంక్షేమ పథకాల మేళవింపుగా రూపుదిద్దుకున్నది.ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్కుమార్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద తదితరులు పాల్గొన్నారు.