వనపర్తి : మునుగోడులో జరుగనున్న ఉప ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా టీఆర్ఎస్ అధిష్టానం మంత్రులకు పలు గ్రామాల బాధ్యతలను అప్పగించింది. దీంట్లో భాగంగా రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ మండలం డీబీ పల్లి, కమ్మగూడెం గ్రామాలు కేటాయించారు. ఈ సందర్భంగా శుక్రవారం వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వనపర్తి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో మంత్రి సమావేశమై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. పార్టీ అభ్యర్థి భారీ గెలుపే లక్ష్యంగా ఓటర్లను చైతన్య పరచాలని సూచించారు. అనంతరం టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మును గోడు ఉప ఎన్నికల ప్రచారానికి బయలుదేరి వెళ్లారు.
అధికార టీఆర్ఎస్ పార్టీ మునుగోడు అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ప్రకటించింది. ఉద్యమకారుడిగా పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతూ, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డినే కోరుకుంటూ స్థానిక నాయకులు, కార్యకర్తలు, జిల్లా పార్టీ నాయకత్వం, నియోజక వర్గ ప్రజల అభిప్రాయాలను, సర్వే రిపోర్టులను పరిశీలించిన తర్వాత సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఉప ఎన్నిక సందర్భంగా ఈ నెల 14 వరకు నామినేషన్లు, 15న నామినేషన్ల పరిశీలన, 17 వరకు నామపత్రాల ఉపసంహరణ, నవంబర్ 3న పోలింగ్ జరుగనుంది. అదేనెల 6న ఫలితాలు వెలువడనున్నాయి.