హైదరాబాద్ : మునుగోడు బై ఎలక్షన్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై 10,309 ఓట్ల మెజారితీతో గెలుపొందారు. అయితే, 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జిల్లాలో మూడు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు రాగా.. ఆయా ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్రెడ్డి లోక్సభకు ఎన్నిక కావడంతో హుజూర్నగర్లో ఎన్నిక రాగా.. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఉత్తమ్ కుమార్రెడ్డి భార్య పద్మావతి బరిలోకి దిగగా.. టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి 43,359 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
ఆ తర్వాత నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా గెలుపొందిన నోముల నర్సింహయ్య మృతి చెందగా.. ఉప ఎన్నికలు రాగా.. ఎన్నికల్లో నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్ 18,804 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాగా సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు జానారెడ్డి రెండో స్థానానికే పరిమితమయ్యారు. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి రెడ్డి విజయం సాధించారు. మొన్నటి వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో 12 నియోజకవర్గాలు ఉండగా.. ఇందులో 11 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తుండగా.. తాజాగా మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించడంతో.. 12 నియోజకవర్గాలతో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా గులాబీ పార్టీకి కంచుకోటగా మారింది.