హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీకి నల్లగొండ జిల్లా కంచుకోటగా ఉందని, మునుగోడులో టీఆర్ఎస్దే విజయమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ధీమా వ్యక్తం చేశారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలోని స్కౌట్స్ అండ్ గైడ్స్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొని మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. హుజుర్ నగర్, నాగార్జున సాగర్లో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. మునుగోడు నియోజకవర్గంలోనూ టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందన్న విశ్వాసం తనకు ఉందన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్నారు. కరోనా వచ్చినా కూడా సంక్షేమ పథకాలను ఆపలేదు. ప్రజలను దగ్గరుండి ఆదుకున్నామని తెలిపారు. దేశ వ్యాప్తంగా మన రాష్ట్ర గౌరవాన్ని సీఎం కేసీఆర్ నిలబెడుతున్నారని చెప్పారు. ఈ క్రమంలో ప్రజలు తప్పకుండా కేసీఆర్ పక్షానే ఉంటారని పేర్కొన్నారు.
దేశ రాజకీయాలను ప్రజలందరూ నిశితంగా గమనిస్తున్నారు. ఒంటెద్దు పోకడలు దేశానికి మంచిది కాదన్నారు. బీజేపీ బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేస్తోంది. ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదన్నారు. బీజేపీ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక ఇలాంటి వాటికి సమాధానం చెప్తుందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.