వరంగల్ : టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నవంబర్ 29న వరంగల్ నగర శివారులో విజయ గర్జన సభ నిర్వహించాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. వరంగల్ నగర సమీపంలోని దేవన్నపేట సమీపంలో సుమారు 10 నుంచి 12 లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించి, విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు శ్రీకారం చుట్టాయి. అందులో భాగంగా నగరంలోని దేవన్నపేట శివారులో సభాస్థలిని గుర్తించి పనులు ప్రారంభించారు.
సభాస్థలిలో జరుగుతున్న పనులను మంత్రి ఎర్రబెల్లి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యేలు అరూరి రమేష్, పెద్ది సుదర్శన్రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, డిసిసిబి చైర్మన్ మార్నేని రవీందర్రావు, వరంగల్ అర్భన్ కో-ఆపరేటీవ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు తదితరులు పరిశీలించారు.
భారీ ఎత్తున జనసమీకరణ చేసి సభను విజయవంతం చేయడానికి ఎలాంటి అటంకాలు కలుగకుండా అన్ని హంగులతో సభ నిర్వహించేందుకు నలువైపులా అనువుగా ఉంటుందని దేవన్నపేట శివారులో సభను నిర్వహించినట్లు చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించి 20 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా పార్టీ సాధించిన విజయాలను, ప్రభుత్వం సాధించిన ప్రగతిని సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు, ప్రజలకు నివేదిస్తారని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.