సూర్యాపేట : మునుగోడు ఉప ఎన్నికకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. దేశానికి ద్రోహం చేస్తూ, రైతులకు మీటర్లు, నిత్యవసరాలు ధరలు పెంచి జేబులకు చిల్లులు పెడుతున్న బీజేపీకి బుద్ధి చెప్పడానికి మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మంత్రి తేల్చిచెప్పారు. మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్తో పాటు జాతీయ రాజకీయాలపై జగదీశ్ రెడ్డి స్పందించారు.
దేశంలో కొత్త అభివృద్ధి నమూనాతో ముందుకు వస్తున్న కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచడానికి దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పెత్తందారులకు దోచిపెడుతున్న బీజేపీ దుష్ట పన్నాగానికి చెక్ పెట్టడానికి మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ యత్నిస్తుందని మండిపడ్డారు. ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న కేసీఆర్ను ఓడించడం ఎవరి వల్ల కాదన్నారు. దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వం కొరుకుంటున్నారని తెలిపారు.
తెలంగాణ సంక్షేమ పథకాలు దేశమంతటా మార్మోగుతున్నాయని చెప్పారు. తెలంగాణ పథకాలు తమకు అందించాలని దేశ ప్రజలు మోడీని ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ను జాతీయ రాజకీయాలకు పంపుతున్నారు. తెలంగాణా సంక్షేమం దేశమంతా విస్తరించాలని కోరుకుంటున్నారని మంత్రి స్పష్టం చేశారు. నిన్నటి కేసీఆర్ సమావేశం చూసి మోదీ, అమిత్ షాలకు రాత్రి నిద్ర పట్టక ఇవాళ నోటిఫికేషన్ ఇచ్చారని విమర్శించారు. మునుగోడులో మాకు కాంగ్రెస్ పార్టీతోనే పోటీ అన్నారు. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ గెలిచి తీరుతుందని జగదీశ్ రెడ్డి తేల్చిచెప్పారు.