హైదరాబాద్: కేసీఆర్ లాంటి నేత తెలంగాణకు దొరకడం రాష్ట్ర ప్రజల అదృష్టమని టీఆర్ఎస్ సెక్రెటరీ జనరల్ కే కేశవరావు అన్నారు. ఉద్యమం చేసిన నేతలు పాలనా పగ్గాలు చేపట్టడం అరుదు, ఎందరికో దక్కని ఈ ఘనత కేసీఆర్కే దక్కిందని చెప్పారు. హైటెక్స్లో జరుగుతున్న టీఆర్ఎస్ ప్లీనరీలో కేకే స్వాగతోపన్యాసం చేశారు. కేవలం టీఆర్ఎస్కే కాదు యావత్ తెలంగాణ ప్రజలకు ఇది పండుగ రోజని చెప్పారు. తెలంగాణ కోసమే పుట్టి, అనుకున్న లక్ష్యాన్ని సాధించి.. ఏడున్నర ఏండ్లుగా అద్భుతమైన పాలన అందిస్తున్న టీఆర్ఎస్ పార్టీకి ద్విదశాబ్ది శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో కష్ట నష్టాలకోర్చి తన మేధస్సుకు పదను పెట్టి తెలంగాణ దశ మారుస్తున్న సీఎం కేసీఆర్ పార్టీ అధ్యక్షుడిగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికవడం మనకందరికీ గర్వ కారణమన్నారు.
సాంస్కృతిక విప్లవంతో తెలంగాణను రీ డిస్కవర్ చేసిన టీఆర్ఎస్ పార్టీ.. ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నదని చెప్పారు. దేశంలోని ఇతర ప్రాంతీయ పార్టీలకు దీటుగా టీఆర్ఎస్ నిలిచి గెలిచిందని, తద్వారా తెలంగాణ అస్థిత్వాన్ని నిలబెట్టగలిగిందన్నారు.
తెలంగాణ వారికి పాలించుకోవడం చేతకాదని అహంకారంతో విమర్శించిన వారికి ప్రజలే కేంద్రంగా అద్భుతమైన పాలన అందిస్తూ ఇదీ తెలంగాణ అని చాటిన నేత కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ పాలనతో తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రపథంలో దూసుకుపోతున్నదని చెప్పారు. కేసీఆర్ ప్రవేశపెట్టి, అమలు చేస్తున్న పథకాలు దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొంది రోల్ మోడల్గా మారాయన్నారు.
‘ఒకప్పుడు రైతుల ఆత్మహత్యలకు నిలయంగా ఉన్న తెలంగాణ నేడు అన్నదాతలకు స్వర్గధామంగా మారుతోంది. అభివృద్ధి, సంక్షేమం కనబడని వాళ్లే టీఆర్ఎస్ పాలనను, కేసీఆర్ తీరును విమర్శిస్తున్నారు. ఏ పార్టీలో ఉన్న నాయకుడైనా గుండె మీద చేయి వేసుకుని ఒక నిమిషం ఆలోచిస్తే అప్పటి తెలంగాణకు.. ఇప్పటి తెలంగాణకు ఉన్న తేడా అర్థమవుతుంది. కేంద్ర ప్రభుత్వ పరంగా ఏ గణాంకాలు చూసినా తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు జాతీయ స్థాయి కన్నా మెరుగ్గానే ఉన్నాయి. తలసరి ఆదాయం పెరిగింది. gsdp రెట్టింపు అయ్యింది. దేశానికి అధిక ఆదాయాన్నిస్తున్న టాప్ 5 రాష్ట్రాల్లో తెలంగాణ చేరడం ఉట్టి మాటలతో సాధ్యం కాలేదు.. కేసీఆర్ గట్టి సంకల్పంతోనే ఇది సాధ్యపడింది.’ అని కేకే అన్నారు.