హైదరాబాద్ : తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరిని నిరసిస్తూ పార్లమెంట్ ఉభయ సభల్లో గళం విప్పాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులను ఆదేశించారు. ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణను ప్రోత్సహించడం మాని, తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ద్వేషపూరితంగా వ్యవహరించడాన్ని ఎండగట్టాలని సూచించారు.
సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో శనివారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ లోక్సభ ఎంపీలు, రాజ్యసభ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సి వ్యూహంపై సీఎం కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ఏర్పడిన ఎనిమిదేళ్ల కాలంలో రాష్ట్ర విభజన హామీలు సహా పలు హక్కులను తొక్కిపడుతున్న బీజేపీ అసంబద్ధ వైఖరిని, కలిసొచ్చే విపక్ష ఎంపీలతో సమన్వయం చేసుకొని ఎండగట్టేందుకు కార్యాచరణపై ఎంపీలతో సీఎం చర్చించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వల్ల దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి నిలిచిపోతున్న నేపథ్యంలో, సోయి ఉన్న తెలంగాణ బిడ్డలుగా, భారత పౌరులుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు పార్లమెంట్ ఉభయ సభలనే సరైన వేదికలుగా మలుచుకోవాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఆర్ధిక క్రమశిక్షణతో అభివృద్ధి చెందుతున్న తెలంగాణను మోడీ ప్రభుత్వం ఏనాడూ ప్రోత్సహించకపోగా, అభివృద్ధిని అడ్డుకునే కుట్రలకు పాల్పడుతున్నదని సీఎం కేసీఆర్ దుయ్యబట్టారు.
దేశంలోని 22 రాష్ట్రాల అప్పులు తెలంగాణకంటే ఎక్కువగా ఉన్నాయని, కానీ, పరిధికి లోబడే తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాలు నడుపుతున్న తీరును ఎంపీలకు ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేళ్ల కాలంలో ఒక్క రోజు కూడా, ఒక్క పైసా కూడా డిఫాల్ట్ కాకుండా తిరిగి చెల్లించిన ట్రాక్ రికార్డు తెలంగాణ సొంతమని సీఎం తెలిపారు. ఆర్బీఐ వేసే బిడ్లలో తెలంగాణకే ఎక్కువ డిమాండ్ పలుకుతున్న విషయం వాస్తవం కాదా? అని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రాన్ని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.
పాలనలో అప్రతిహతంగా ముందుకు సాగుతున్న తెలంగాణ మీద ప్రధాని మోడీకి కన్నుకుట్టిందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. నిబంధనల పేరుతో ఆర్థికంగా తెలంగాణను అణచివేయాలని చూడటం అత్యంత శోచనీయమన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకునే నిర్ణయాలు బీజేపీ సోషల్ మీడియా గ్రూప్లకు ఎట్లా చేరుతున్నాయో.. బీజేపీ నాయకత్వం స్పష్టం చేయాలని అన్నారు. దేశానికి, రాష్ట్రాలకు నడుమ గోప్యంగా ఉండాల్సిన ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా లీక్ చేసి, తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేయడం.. నేరపూరిత చర్య అని సీఎం స్పష్టం చేశారు.
ఇదంతా ఒక పకడ్బందీ పథకం ప్రకారం జరుగుతున్న బీజేపీ రాజకీయ దిగజారుడుతనమని సీఎం దుయ్యబట్టారు. తెలంగాణ పట్ల కేంద్ర బీజేపీ జాతీయ నాయకత్వం చౌకబారు రాజకీయాలను ఆశ్రయించడం దురదృష్టకరమని సీఎం అన్నారు. ప్రతిఏటా ఎఫ్ఆర్బీఎం లిమిట్ను కేంద్రం ప్రకటిస్తుందని, ఆ తర్వాతే రాష్ట్రాలు కేంద్రం ప్రకటనపై ఆధారపడి వారి వారి బడ్జెట్లను రూపొందించుకుంటాయన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎఫ్ఆర్బీఎం లిమిట్ రూ.53వేల కోట్లు అని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తర్వాత మాట మార్చడం ఏంటని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఆమోదం పొందిన తర్వాత అకస్మాత్తుగా, కక్షపూరితంగా రూ.53వేల కోట్ల ఎఫ్ఆర్బీఎం లిమిట్ను రూ.23వేలకోట్లకు కుదించడం కుట్ర కాదా? అని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని నిలదీశారు. ఇలాంటి దివాళాకోరు, తెలివితక్కువ వ్యవహారాలపై పార్లమెంట్ ఉభయ సభల్లో బీజేపీని నిలదీస్తూ, వారి నగ్న స్వరూపాన్ని బట్టబయలు చేయాలని ఎంపీలకు సూచించారు. అందుకు అన్నిరకాల ప్రజాస్వామిక పద్ధతులను అనుసరించాలని దిశానిర్దేశం చేశారు.
విద్యుత్ సంస్కరణల పేరుతో కేంద్రం తమకు అయినవారికి అప్పనంగా దోచిపెట్టేందుకు రాష్ట్రాలమీద ఒత్తిడి తేవడంపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. దీనిపై కేంద్రాన్ని నిలదీయాలని ఎంపీలకు సూచనలు చేశారు. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచీ ప్రతిసారీ నీతి ఆయోగ్ ప్రశంసిస్తున్నదని, అత్యుత్తమ ప్రగతిని సాధిస్తున్న రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహించాలని పలుమార్లు నీతి ఆయోగ్ వంటి సంస్థలను చేసిన సిఫారసులను ఉద్దేశపూర్వకంగా బుట్ట దాఖలు చేసిందని, దీనిపై కూడా నిలదీయాలని సీఎం చెప్పారు.
దేశంలో ఏ మూలన అభివృద్ధి సాధిస్తున్నా అది దేశ జీడీపీకే సమకూరుతుందన్నారు. దేశంలో కేవలం ఎనిమిది రాష్ట్రాలే ఎక్కువ శాతం దేశ జీడీపీకి కంట్రిబ్యూట్ చేస్తున్నాయని, అందులో తెలంగాణ ఒకటని సీఎం తెలిపారు. తెలంగాణ నుంచి 8 ఏండ్లలో కేంద్రానికి పోయింది ఎంత? కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చిన నిధులెన్ని? అనే లెక్కలు పరిశీలిస్తే సామాన్యులకు కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న అన్యాయం ఏమిటో అర్థమవుతుందని సీఎం కేసీఆర్ అన్నారు.
సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ వరంగల్కు బయలుదేరి వెళ్లారు. వరదల నేపథ్యంలో గోదావరి పరీవాహక ప్రాంతంలో ఆదివారం సీఎం ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి హరీశ్రావు, ఎంపీ సంతోష్కుమార్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్రెడ్డి, సీఎస్ సోమేశ్కుమార్, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, వైద్య ఆరోగ్య తదితర శాఖల ఉన్నతాధికారులు ఉన్నారు.