రైతుల ఆత్మహత్యలపై అబద్ధాలు మాట్లాడేందుకు రేవంత్రెడ్డికి సిగ్గుండాలి. దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు పెరిగితే, తెలంగాణలో 48 శాతం తగ్గిన విషయాన్ని రేవంత్రెడ్డి అడిగిన ప్రశ్నకే కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్ పార్లమెంటులో సమాధానంగా చెప్పారు. హిందీ, ఇంగ్లిష్ అర్థం కాకపోతే తెలుగులోకి అనువాదం చేయించుకొని చదువుకో.
-ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): వడ్ల కొనుగోలు, మెడికల్ సీట్లు.. అంశం ఏదైనా నిజాలు నిగ్గు తేల్చుకుందాం రండి అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి, బీజేపీ నేతలకు రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి సవాల్ విసిరారు. టీఆర్ఎస్ఎల్పీలో విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ వీజీ గౌడ్ తో కలిసి ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీపై రేవంత్ తప్పుడు ఆరోపణలతో గవర్నర్కు లేఖ రాయడాన్ని తప్పుబట్టారు. బీజేపీ తీసుకొచ్చిన నీట్ విధానం వల్ల అవకతవకలకు అవకాశం ఏర్పడిందని దుయ్యబట్టారు. కొందరు అడ్మిషన్లు తీసుకోకుండా సీట్లను బ్లాక్ చేస్తూ, మేనేజ్మెంట్ కోటా కింద విక్రయించి కోట్లు దండుకొంటున్నారని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదని స్పష్టం చేశారు. అవకతవకలను మొదటగా గుర్తించిందే తెలంగాణ ప్రభుత్వమని, కాళోజీ యూనివర్సిటీ అధికారులు సుమోటోగా పోలీసులకు సమాచారం ఇచ్చారని గుర్తుచేశారు. బ్లాక్ దం దాను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2020లోనే జీవో జారీ చేసిందని తెలిపారు. రెండు విడతలుగా కౌన్సిలింగ్ పూర్తయినప్పటికీ, ఒక్క సీటును కూడా ప్రభుత్వం మేనేజ్మెంట్లకు కేటాయించలేదని వెల్లడించారు. ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమని మంత్రులు పువ్వాడ అజయ్, మల్లారెడ్డి ప్రకటించారని గుర్తుచేశారు. మెడికల్ కాలేజీ లేని తనపై కూడా ఆరోపణలు చేయడం రేవంత్రెడ్డి అడ్డగోలు తనానికి నిదర్శనమని దుయ్యబట్టారు. మెడికల్ కాలేజీ అడ్మిషన్లలో అవకతవకలను నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు.
బీజేపీతో రేవంత్ కుమ్మక్కు
నలుగురు బీజేపీ ఎంపీలు ధాన్యం సేకరణకు అడ్డుపడుతూ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు గండి కొడుతున్నారని పల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయాలని ఇతర రాష్ర్టాలు కూడా డిమాండ్ చేస్తున్నాయని గుర్తుచేశారు. కష్టాలకు ఎదురొడ్డి ధాన్యం సేకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి రేవంత్రెడ్డి బీజేపీతో కుమ్మక్కై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుల ఆత్మహత్యలపై అబద్ధాలు మాట్లాడేందుకు రేవంత్రెడ్డికి సిగ్గుండాలని ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు పెరిగితే, తెలంగాణలో 48 శాతం తగ్గిన విషయాన్ని కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్ పార్లమెంటులో రేవంత్రెడ్డి అడిగిన ప్రశ్నకే సమాధానంగా చెప్పారని గుర్తుచేశారు. హిందీ, ఇంగ్లిష్ అర్థం కాకపోతే తెలుగులోకి అనువాదం చేయించుకొని చదువుకోవాలని చురకలంటించారు. అడ్డగోలుగా మాట్లాడితే రేవంత్ తాట తీస్తామని హెచ్చరించారు.
బండి వ్యాఖ్యలు హాస్యాస్పదం: బాల సుమన్
బీజేపీ లేకుంటే టీఆర్ఎస్కు పదవులు ఎకడివని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఎద్దేవాచేశారు. తెలంగాణ చరిత్ర తెలియని చవట, త్యాగాలు తెలియని సన్నాసి, తంబాకు సంజయ్ అని ప్రజలు పిలుచుకొంటున్నారని విమర్శించారు. ఏపీ ప్రాజెక్ట్ హంద్రీ-నీవాకు హారతులు పట్టిన డీకే అరుణను వెంట బెట్టుకొని తెలంగాణ సాగునీటి గురించి బీజేపీ నేతలు మాట్లాడటం హాస్యాస్పదమని మండిపడ్డారు. ప్రొఫార్మా సరిగా నింపకపోవడం వల్లే తెలంగాణకు మెడికల్ కాలేజీ ఇవ్వలేదని కిషన్రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేటకే నిధులు కేటాయిస్తున్నారంటూ కిషన్రెడ్డి మాట్లాడటం అర్థరహితమని పేర్కొన్నారు. గుజరాత్ విషయంలో కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ అడ్డగాడిదలా మాట్లాడుతున్నారని, ఆయనతో పాటు బీజేపీ నేతల నోళ్లను ఫినాయిల్తో కడగాలని ఎద్దేవా చేశారు.
బీజేపీ ఏజెంట్ రేవంత్
ఆరెస్సెస్ రక్తం ఉన్న రేవంత్రెడ్డి బీజేపీకి ఏజెంట్గా పనిచేస్తున్నారని బాల్క సుమన్ మండిపడ్డారు. హుజురాబాద్లో మాదిరిగానే కాంగ్రెస్ను హోల్సేల్గా బీజేపీకి తాకట్టు పెడతాడని విమర్శించారు. తెలంగాణకు ద్రోహం చేస్తున్న ప్రధాని మోదీని, బీజేపీని రేవంత్ నిలదీయకపోవడంలో ఆంతర్యమదేనని పేర్కొన్నారు. డ్రగ్స్పై మాట్లాడుతున్న రేవంత్ ఎవరితో కులికాడో అందరికీ తెలుసని చెప్పారు. డ్రగ్స్ అడిక్షన్ నిర్ధారణ కోసం రాహుల్గాంధీ నుంచి శాంపిల్స్ ఇప్పిస్తావా? అని ప్రశ్నించారు. రాహుల్గాంధీ ఓయూకి వచ్చేముందు ఆత్మహత్యలు చేసుకొన్న వేణుగోపాల్రెడ్డి, ఇషాన్రెడ్డి కుటుంబాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్గాంధీ ఎన్నిసార్లు తెలంగాణకు వచ్చినా కాంగ్రెస్ను బతికించలేరని, ఇప్పుడున్న సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు.
టీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లోనూ సింగిల్గానే పోటీ చేస్తుందని, పొత్తులపై మీడియాలో వస్తున్న కథనాలల్లో వాస్తవం లేదని పేర్కొన్నారు. గవర్నర్ బీజేపీ కార్యకర్తగా వ్యవహరించడం వల్లే సమస్యలు వస్తాయని అన్నారు. ఇతర రాష్ర్టాల్లోనూ గవర్నర్లకు అక్కడి పార్టీలు నల్ల జెండాలతో నిరసన తెలుపుతున్నాయని గుర్తుచేశారు. తెలంగాణపై అవాకులు చవాకులు పేలుతున్న ఏపీ బీజేపీ ఎంపీ నరసింహారావు ముందు తన రాష్ట్రం సంగతి చూసుకోవాలని హితవు పలికారు.