హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో జిల్లాకో నవోదయ విద్యాలయం నెలకొల్పడంలో కేంద్రం వివక్ష చూపుతున్నదని టీఆర్ఎస్ ఎంపీలు విమర్శించారు. తెలంగాణ బిడ్డలు భారతీయులు కారా? అని కేంద్రాన్ని నిలదీశారు. శుక్రవారం టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎంపీలు పార్లమెంట్ ఉభయ సభల్లో వాయిదా తీర్మానం కోసం పట్టుబట్టారు. సమావేశాలు ప్రారంభంగానే లోక్సభలో ఎంపీలు నామా నాగేశ్వర్రావు, పోతుగంటి రాములు, బీబీ పాటిల్, వెంకటేశ్నేత, కొత్త ప్రభాకర్రెడ్డి, పసునూరి దయాకర్, మన్నే శ్రీనివాస్రెడ్డి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్రంలో నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యసభలో ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్, కేఆర్ సురేశ్రెడ్డి సభ ప్రారంభం కాగానే వాయిదా తీర్మానం కోసం పట్టుబట్టారు. వాయిదా తీర్మానంపై చర్చకు నిరాకరించటంతో ఎంపీలు వాకౌట్ చేశారు. గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తంచేశారు.
జాతి సమగ్రతను విస్మరిస్తున్న కేంద్రం
జాతి సమగ్రతను పెంపొందించే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నవోదయ విద్యాలయాలు ప్రారంభించాలన్న స్ఫూర్తిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తున్నదని రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డి విమర్శించారు. తెలంగాణపై కేంద్రం అనుసరిస్తున్న మొండివైఖరిని, వివక్షపూరిత ధోరణిని ఎండగడతామని హెచ్చరించారు.
– రాజ్యసభ సభ్యుడు సురేశ్రెడ్డి
రాష్ట్రంపై కేంద్రం వివక్ష
తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం కక్ష కట్టిందని, అన్ని రంగాల్లో వివక్ష చూపుతున్నదని టీఆర్ఎస్ లోక్సభాపక్షనేత నామా నాగేశ్వర్రావు ధ్వజమెత్తారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని 33 జిల్లాలకు నవోదయ విద్యాలయాలు కావాలని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రధాని మోదీని కలిసి కోరినా పట్టించుకోవటంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటీవల దేశవ్యాప్తంగా 80 నవోదయ స్కూళ్లు మంజూరుచేసిన కేంద్రం, అందులో ఒక్కటి కూడా రాష్ర్టానికి ఇవ్వలేదని ఆయన ధ్వజమెత్తారు.
– టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా
బీజేపీ ఎంపీలు ఏ ముఖం పెట్టుకొని తిరుగుతారు?
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతుంటే ఆ వర్గాలను అవమానపరిచేవిధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని.. రాష్ట్రంలో బీజేపీ ఎంపీలు ఏ మొఖం పెట్టుకొని తిరుగుతారని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులు పండించిన వడ్లను కొనొద్దని బీజేపీ నేతలు కేంద్రమంత్రి గోయల్కు చెప్పి శిఖండి పాత్ర పోషించారని ఆయన ఆరోపించారు.
– రాజ్యసభ సభ్యుడు లింగయ్య యాదవ్