న్యూఢిల్లీ: అన్ని పార్టీలు మద్దుతు ఇచ్చిన బిల్లు అశాస్త్రీయం ఎలా అవుతుందని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు ప్రశ్నించారు. బిల్లు ఆమోదంలో అశాస్త్రీయం ఏముందో బీజేపీ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వమే చాలా బిల్లులను చర్చించకుండానే ఆమోదిస్తున్నదని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఎంపీలు కవిత, రంజిత్రెడ్డి, నామా నాగేశ్వరరావుతో కలిసి ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ అసందర్భంగా తెలంగాణ ఏర్పాటును ప్రస్తావించారని విమర్శించారు. తెలంగాణ ప్రజలను ప్రధాని అవమానించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్లమెంటు సాక్షిగా ఏర్పాటైన రాష్ట్రంపై మోదీ వ్యాఖ్యలు సరికావన్నారు.
రాష్ట్ర విభజన అనేది భావోద్వేగాలతో కూడిందని ఎంపీ కేకే చెప్పారు. ఎన్నో ఏండ్ల ఉద్యమం ద్వారా తెలంగాణ సాకారమైందని తెలిపారు. విస్తృత అధ్యయనం తర్వాతే పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టారని, కీలక బిల్లుపై ఓటింగ్ జరిగితే సభ్యుల లెక్కింపు తప్పక జరుగుతుందని వెల్లడించారు. రాష్ట్ర విభజన బిల్లుకు బీజేపీ కూడా మద్దతు ఇచ్చిందని గుర్తుచేశారు.
అధికార, విపక్ష పార్టీలు బిల్లుకు మద్దుతు ఇచ్చినప్పుడు సంఖ్యాబలం సమస్య ఉత్పన్నంకాదని చెప్పారు. 2/3 వంతు మెజార్టీ తర్వాతే బిల్లు ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించారన్నారు. ఉభయ సభల ఆమోదం తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్ర పడిందన్నారు. అయినా.. అన్ని పార్టీలు మద్దతు ఇచ్చిన బిల్లు అశాస్త్రీయం ఎలా అవుతుందని ప్రశ్నించారు. బిల్లు ఆమోదంలో అశాస్త్రీయం ఏముందో చెప్పాలని డిమాండ్ చేశారు. జార్ఖండ్ బిల్లు ఆమోదం సమయంలో కొందరు సభ్యులు అప్పటి ప్రధాని వాజ్పేయీ మీదకు దూసుకెళ్లారని గుర్తుచేశారు.