హైదరాబాద్ : దేశానికి అన్నం పెట్టే అన్నదాతలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర రైతు బంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. వ్యవసాయానికి రైతులను దూరం చేసే విధంగా కేంద్రం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. పీఎం కిసాన్ లబ్దిదారులను
కేంద్రం క్రమక్రమంగా తగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019, ఫిబ్రవరిలో ఈ పథకాన్ని అమలు చేసినప్పుడు లబ్దిదారుల సంఖ్య పదకొండున్నర కోట్లుగా ఉండే. రాను రాను ఆ సంఖ్యను మూడున్నర కోట్లకు తగ్గించారు. లబ్దిదారుల సంఖ్య తగ్గించి రైతుల ఉసురు తీసుకుంటున్నారని రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.
ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీలు బసవరాజు సారయ్య, కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి పల్లా రాజేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పీఎం కిసాన్ లబ్దిదారులను ఛత్తీస్గఢ్లో 94 శాతం తగ్గించారు. అన్ని రాష్ట్రాల్లో దాదాపు ఇదే పరిస్థితి ఉందన్నారు. వ్యవసాయ కరెంట్ మోటార్లకు మీటర్లు బిగించడంపై దేశ వ్యాప్తంగా పోరాటం మొదలైంది. యూపీలో ఎన్నికలప్పుడు ఒకటి చెప్పారు. ఇప్పుడు మరొకటి చేస్తున్నారు. అందుకే అక్కడి రైతులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మహారాష్ట్రలో గత ఆరు నెలల్లో 1800 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మోదీకి లేఖలు రాసి మరీ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.
దేశ వ్యాప్తంగా రైతులు మరో పోరాటానికి సిద్ధం అవుతున్నారని ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్రం రైతుల కోసం ఏమి చేయడం లేదు. కేసీఆర్ ప్రభుత్వం రైతుల కోసం అన్నీ చేస్తోందని పేర్కొన్నారు. రైతు బంధు పథకాన్ని అమలు చేయాలని చాలా రాష్ట్రాల రైతులు తమ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణలో పది సీజన్లలో ఇప్పటి వరకు రూ. 57 వేల కోట్లకు పైగా రైతుబంధు కింద అందించామని చెప్పారు. ప్రారంభంలో 130 లక్షల ఎకరాలకు సాయం అందితే.. ఇప్పుడు 150 లక్షల ఎకరాలకు చేరిందని రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.