కరీంనగర్ : కరీంనగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వరస్వామి వారికి కవిత ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు ఆమెను ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. కరీంనగర్లోని స్వయంభు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం తన అదృష్టం అన్నారు. మంత్రి గంగుల కమలాకర్ అద్భుతంగా స్వామి వారి వేడుకలని నిర్వహిస్తున్నారని కొనియాడారు. ఇక్కడ కూడా తిరుపతిలో మాడ వీధులు ఉన్నట్టుగానే ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. స్వామి వారి అనుగ్రహం తెలంగాణపై ఉండాలని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు.