నిజామాబాద్ : రేషన్ దుకాణాల్లో ప్రధాని మోదీ ఫోటో ఎందుకు పెట్టలేదని కలెక్టర్పై రుసరుసలాడిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోదీ ఫోటో గ్యాస్ సిలిండర్, యూరియా బస్తాలపై తప్పకుండా పెడుతామని కవిత స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ సంక్షేమ సారథి అయితే.. ప్రధాని మోదీ సంక్షేమ పథకాల వ్యతిరేకి అని కవిత నిప్పులు చెరిగారు. బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టిపోయిన తన మిత్రులకేమో మోదీ రూ. 10 లక్షల కోట్లు పంచుతున్నాడు.. కానీ పేదవాళ్లకు ఉచితాలు ఇస్తే తప్పంటున్నారని ధ్వజమెత్తారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కవిత పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చి రేషన్ షాపులలో ప్రధాని మోదీ ఫోటో ఎందుకు లేదని అడిగారని, ఎక్కడైనా రేషన్ షాపులో ప్రధాని ఫొటోలు పెడతారా? అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు తెలంగాణకు వచ్చి పంచాయితీ పెట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ కవిత, టీఆర్ఎస్ను ఆగం పట్టించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
57 ఏండ్లు పైబడిన వాళ్లకు పెన్షన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని, నిజామాబాద్ పట్టణంలో కొత్తగా 9 వేల మందికి, నిజామాబాద్ జిల్లాలో కొత్తగా 50 వేల మందికి పెన్షన్లు ఇస్తున్నామని కవిత తెలిపారు. నిజామాబాద్ పట్టణంలో 60 వేల ఇండ్లు ఉంటే, 40 వేల మందికి పెన్షన్ ఇస్తున్నామని ఎమ్మెల్సీ స్పష్టం చేశారు.
భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయని అందులో కేవలం తెలంగాణలోనే ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్లు ఇస్తున్నారని పక్కనున్న మహారాష్ట్రలో ఎంత ఇస్తున్నారో పక్కనే ఉన్న మహారాష్ట్రతో అనుబంధం ఉన్న వారికి తెలుసన్నారు ఎమ్మెల్సీ కవిత. పేదలకు, వృద్దులకు, బీడి కార్మికులకు, మానసిక పరిస్థితి బాగా లేని వాళ్లు.. ఇలా అనేక వర్గాలకు పెన్షన్ ఇస్తున్నామని, రాష్ట్రం రాకముందు రూ.200 పెన్షన్ ఉంటే, రాష్ట్రం ఏర్పడిన తర్వాత రూ.1000 తో పెన్షన్ ఇవ్వడం ప్రారంభించుకున్నామని ఎమ్మెల్సీ కవిత గుర్తుచేశారు.
వయసు పైబడిన వాళ్లు, పేద వాళ్లు ఆత్మగౌరవంతో బతకాలనే సీఎం కేసీఆర్ పెన్షన్ ఇస్తున్నారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఒక ఇంట్లో ఒక కాలు లేని బిడ్డ ఉంటే, ఆ ఇంటికి ఎంత భారంగా ఉంటదో అర్థం చేసుకునే గుండె ఉన్న వ్యక్తి కేసీఆర్ కాబట్టి, ఆ గుండె నిరంతరం తెలంగాణ బిడ్డల కోసం కొట్టుకుంటుందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పెద్ద మొత్తంలో పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. పేద వాళ్లకు పెన్షన్ ఇస్తే, వాళ్ల ఆశీర్వాదంతో తెలంగాణ, బంగారు తెలంగాణ అయితది… సంపద సృష్టించే తెలంగాణ అవుతది.. దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రం అవుతదని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. అంతేకాదు ఇంట్లో ఒక్కరికి కాదు, ఇద్దరికి పెన్షన్ ఇచ్చే స్థాయికి తెలంగాణలో సంపద పెరగాలని కోరుకుంటున్నాని అన్నారు. పెన్షన్ రాని వాళ్లకు కూడా త్వరలో వస్తుందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.
ఒకవైపు తెలంగాణ రాష్ట్రం సంక్షేమ పథకాల అమలులో దేశంలో అగ్రస్థానంలో ఉండగా, మరోవైపు పేదలకు ఇస్తున్న ఉచితాలను ఆపాలంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి పోయిన తన మిత్రులకు మోదీ రూ. పది లక్షల కోట్లు పంచుతున్నడు కానీ పేద వాళ్లకు ఉచితాలు ఇస్తే తప్పంటున్నరని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. పేదవాళ్లకు రేషన్, పెన్షన్, షాదీ ముబారక్, స్కాలర్ షిప్ లాంటివి ఇవ్వద్దని మోదీ చెబుతున్నారు. ఉచిత పథకాలు ఇచ్చి ప్రభుత్వాలు ప్రజలను చెడగొడుతున్నాయని మోదీ అనడం సరికాదన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం కరోనా వచ్చినా, పెన్షన్ ఇచ్చుడు ఆపలేదు. రేషన్, కరెంటు, వ్యవసాయం ఏదీ ఆపలేదని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. వ్యవసాయం ఆపే ప్రసక్తే లేదు… కచ్చితంగా ధాన్యం కొంటం అని మోదీతో జరిగిన సమావేశంలో చెప్పిన ఏకైక సీఎం మన కేసీఆర్ అని గుర్తు చేశారు. వ్యవసాయం ఆగితే వచ్చే ఇబ్బందులు కేసీఆర్కు తెలుసన్నారు. కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ఉచిత పథకాలపై చర్చ మొదలు పెట్టిందని, యువకులు, మహిళలు వాట్సాప్ లో బీజేపీ చేసే తప్పుడు ప్రచారాలపై జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు.
అనంతరం పెన్షన్ లబ్ధిదారులతో కలిసి ఎమ్మెల్సీ కవిత సహపంక్తి భోజనం చేసారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాజేశ్వర్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, మేయర్ నీతూ కిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్ పాల్గొన్నారు.