నిజామాబాద్ : భారతీయ జనతా పార్టీ నాయకులపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. బీజేపీ నాయకుల బట్టేబాజ్ మాటలతో అభివృద్ధి జరగదు అని ఆమె పేర్కొన్నారు. బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్లో 18 అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత కలిసి శంకుస్థాపన చేశారు. దాదాపు రూ. 30 కోట్లతో భీమ్గల్ పట్టణంలో ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులు ప్రారంభించింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. కేవలం రాజకీయాల కోసం మాట్లాడే వారికి కాకుండా ప్రజల కోసం బాధ్యతతో పనిచేసే నాయకులకే మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఏడేండ్లలో తెలంగాణ దేశంలోనే అగ్రరాష్ట్రంగా నిలిచిందని, దీనికి సీఎం కేసీఆర్ కృషి, పట్టుదలే కారణమన్నారు. రాష్ట్రం కోసం ఎంత ప్రేమతో కొట్లాడినమో, రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా సీఎం కేసీఆర్ అంతే చిత్తశుద్దితో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దుతుంటే, కొంత మంది రాజకీయాల కోసం ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం మరొకరిని చేయమనటం సరికాదని పేర్కొన్నారు. కొందరు బీజేపీ నాయకులు కేవలం రాజకీయాల కొసం బట్టేబాజ్ మాటలు చెప్తున్నారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. పనిచేసే నాయకులకు ప్రజల ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందన్న ఎమ్మెల్సీ కవిత, సీఎం కేసీఆర్ను రాష్ట్ర ప్రజలు రెండు సార్లు దీవించి ముఖ్యమంత్రిగా గెలిపించారని తెలిపారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో భీమ్ గల్ లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్న ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. బాల్కొండను బంగారు బాల్కొండగా మార్చే భాద్యత తనదని ప్రకటించారు. భీమ్గల్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని, భీంగల్ పట్టణంలో త్వరలో 100 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు.