హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): ఎవరిని ఉద్ధరించేందుకు జాతి సంపదను అమ్మకానికి పెట్టారు? దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలను అమ్మకానికి పెట్టి జాతిని నిర్వీర్యం చేయటమే జాతీయ పార్టీల ఉద్దేశమా? అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, మనరాష్ట్రంలోని ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలవటాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. బుధవారం ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె బీజేపీ, కాంగ్రెస్ విధానాలను తీవ్రంగా తప్పుబట్టారు. తెలంగాణ బొగ్గు గనులు, ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ అమ్మడం ద్వారా వచ్చిన సొమ్మును రాష్ట్రం కోసం వినియోగించాలని కేంద్రాన్ని అడిగే దమ్ము కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి ఉన్నదా? అని నిలదీశారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్తులను అమ్మి ఆ సొమ్మును ఏం చేయబోతున్నారని ప్రశ్నించారు.
రోడ్డున పడుతున్న లక్షలమంది కార్మికులు
పునరుద్ధరించాల్సిన వ్యవస్థలను ధ్వంసం చేసి లక్షలమంది జీవితాలను రోడ్డున పడేయటమే బీజేపీ విధానంగా మారిందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ‘ఇక్కడి ఫ్యాక్టరీని అమ్మి అందులో పనిచేసే వేలమంది కార్మికులు, సిబ్బందికి ఉపాధి కల్పించేందుకు తెలంగాణలో ఏదైనా కొత్త ఫ్యాక్టరీ పెట్టబోతున్నారా? లేదా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేయబోతున్నారా? కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. సింగరేణి బొగ్గు గనులను, ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ, ఇతర ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడం ద్వారా ఏం సాధించాలని కలలు కంటున్నారో సమాధానం చెప్పాలని కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బండి సంజయ్ని ప్రశ్నించారు.
ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి అనేక లేఖలు రాయటమే కాకుండా స్వయంగా కలిసి విన్నవించారని, మంత్రి కేటీఆర్ అనేకమార్లు ఉత్తరాలు రాశారని గుర్తుచేశారు. కేంద్రం వేల కుటుంబాలను రోడ్డున పడేసేందుకే ఫ్యాక్టరీలను అప్పనంగా అమ్ముతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ఆ ఫ్యాక్టరీలపై ఆధారపడ్డ కుటుంబాలకు బీజేపీ నేతలు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ఫ్యాక్టరీల పునరుద్ధరణకు అన్ని విధాల సహకరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినా ఆదిలాబాద్ సీసీఐని అమ్మివేయటం వెనుక ఆంతర్యం ఏమిటని నిలదీశారు.
స్పష్టమైన ఎజెండాతో ప్రాంతీయ పార్టీలు
ప్రజల సంక్షేమం కోసం ప్రాంతీయ పార్టీలకు స్పష్టమైన ఎజెండా ఉన్నదని, ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ అర్థం చేసుకోవాలని కవిత సూచించారు. మహారాష్ట్రలో ప్రాంతీయ పార్టీ సహకారంతోనే కాంగ్రెస్ అధికారంలో ఉన్నదనే విషయాన్ని రాహుల్గాంధీ విస్మరించారని విమర్శించారు. జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ మహారాష్ట్రలో ఇప్పుడు తోకపార్టీగా మారిందని ఎద్దేవా చేశారు. దేశానికి ప్రాంతీయ పార్టీలే సారథ్య బాధ్యతలు వహించి దిశానిర్దేశం చేయనున్నాయని స్పష్టం చేశారు. అనేక రాష్ర్టాల్లో ప్రాంతీయ పార్టీలే మెరుగైన పాలన అందిస్తూ, దేశ ప్రజల ప్రశంసలు పొందబోతున్నాయని చెప్పారు.