హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం మీడియాతో చిట్ చాట్ చేశారు. బీఆర్ఎస్ వల్ల బీజేపీ బ్రెయిన్ డ్యామేజ్ అయిందని కవిత పేర్కొన్నారు. మోదీనేమో మమతా బెనర్జీని, బండి సంజయేమో తనను అవహేళన చేశారు. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పారు. తెలంగాణ ప్రజలు కూడా బీజేపీకి బుద్ధి చెప్తారు. యాగాలు చేయడం కేసీఆర్కు కొత్త కాదు. భారత రాష్ట్ర సమితికి దైవశక్తి అవసరం. కాబట్టే యాగాలు చేస్తున్నాం. రానున్న రోజుల్లో బీఆర్ఎస్లో చాలా రాష్ట్రాల నుంచి చేరికలు ఉంటాయని కవిత స్పష్టం చేశారు.
నిర్మలా సీతారామన్ వీక్ హిందీ గురించి కాకుండా వీక్ రూపి గురించి స్పందిస్తే మంచిదని కవిత అన్నారు. తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకుండా నిర్మల అడ్డుకుంటున్నారు. భాషపై దృష్టి కాకుండా ప్రజల సమస్యపై మా దృష్టి. బీజేపీ కూడా ప్రజల సమస్యపై దృష్టి పెట్టాలి అని సూచించారు.
భారత్ జాగృతి ద్వారా దేశ వ్యాప్తంగా కార్యక్రమాలు అమలు చేస్తాం అని కవిత ప్రకటించారు. రాష్ట్రంలో తెలంగాణ జాగృతి కొనసాగుతోంది. జాతీయ స్థాయిలో బీజేపీకి బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం కాబోతోంది. బీజేపీ వ్యతిరేక కూటములను ఏకం చేస్తాం. ఇతర రాష్ట్రాల్లో అక్కడి పరిస్థితులను బట్టి వ్యూహాలు ఖరారు చేస్తాం అని స్పష్టం చేశారు.
బండి సంజయ్ తన పదవికి మచ్చ తెచ్చే విధంగా మాట్లాడుతున్నారు. మహిళలను అవహేళన చేసే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. సరైన సమయంలో ప్రజలు బీజేపీకి సమాధానం చెబుతారు. బండి సంజయ్ మాటలు బాధ కలిగిస్తున్నాయి. ఆయన బతుకమ్మను కూడా అవమానించారు అని కవిత పేర్కొన్నారు.