నల్లగొండ, జనవరి 20: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారిందని శాసన మండలి మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. ఆ పార్టీ నేతల మధ్యే కుమ్ములాటలు ఎక్కువయ్యాయని, వాటిని కప్పి పుచ్చుకొనేందుకే సదరు నాయకులు టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం ఆయన నల్లగొండలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వాళ్లలో వాళ్లకు పడక తన్నుకుంటుంటే జనం నవ్వుకుంటున్నారని తెలిపారు. ఉత్తమ్ కుమార్రెడ్డి అధికారానికి దూరమై చాలాకాలమే అయినా ఇంకా ఉత్తరకుమార మాటలు మానడం లేదని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్, బీజేపీ నేతలు పగటి కలలు కంటున్నారన్నారు. వాళ్లను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, మరోసారి టీఆర్ఎస్సే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తమ్.. నల్లగొండలో ఎందుకు పెట్టడం లేదని గుత్తా సుఖేందర్రెడ్డి ప్రశ్నించారు. నల్లగొండలో కోమటిరెడ్డితో మాట్లాడరా.. సభ పెట్టరా? అని నిలదీశారు. ‘మీలో మీకే పడక.. మాపై చవకబారు మాటలేంది?’ అని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుల కుమ్ములాటలు తారస్థాయికి చేరాయని, వాళ్లకు ఇంకా బుద్ధి రాదని, అందుకే తన్నుకు చస్తున్నారన్నారు. ఐటీ, పరిశ్రమలు, వ్యవసాయం, సంక్షేమ రంగాల్లో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన టీఆర్ఎస్ సర్కార్కు దేశవ్యాప్తంగా కితాబు వస్తుంటే.. కాంగ్రెస్, బీజేపీ నాయకులు తట్టుకోవడం లేదన్నారు. అధికారం తప్ప మరో యావ లేని కాంగ్రెస్, బీజేపీ నేతలు దోచుకొని తినడానికే అడ్డగోలు విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. అహంకార పూరితమైన విమర్శలు చేయడం మంచిది కాదనే విషయం బండి సంజయ్ తెలుసుకోవాలన్నారు. బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండికి ఆయన నియోజకవర్గంలోనే గుండు గీస్తారని చెప్పారు. ఐదు రాష్ర్టాల్లో జరిగే ఎన్నికల్లో ఒక్కచోట కూడా కాంగ్రెస్, బీజేపీ గెలిచే పరిస్థితి లేదని గుత్తా పేర్కొన్నారు. సమావేశంలో జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి పాల్గొన్నారు.